- ఆపరేషన్ థియేటర్లో అగ్నికీలలు
- చిన్నారిసహా ఇద్దరు మృతి
లక్నో : ప్రభుత్వాసుపత్రి ఆపరేషన్ థియేటర్లో మంటలు చెలరేగడంతో చికిత్స పొందుతున్న ఓ చిన్నారి, మరో మహిళ ప్రాణాలు కోల్పోయిన ఘటన ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో చోటుచేసుకుంది. ఓ మహిళ సర్జరీ నిమిత్తం పోస్టు గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ హాస్పిటల్లో చేరింది. మరో చిన్నారి గుండె సర్జరీ నిమిత్తం అదే ఆస్పత్రిలో చేరింది. ఆ ఇద్దరు ఆపరేషన్ థియేటర్లో ఉండగా మంటలు చెలరేగడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని, మంటలను అదుపు చేశారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని మృతుల కుటుంబ సభ్యులు వాపోయారు. ఆస్పత్రి సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.