- రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు
- నేడు విడుదల?
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఊరట లభించింది. ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్కు రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.లక్ష పూచీకత్తుపై వెకేషన్ బెంచ్ ప్రత్యేక న్యాయమూర్తి బెయిల్ను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కేజ్రీవాల్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై రెండు రోజుల పాటు విచారించిన అనంతరం అవెన్యూ కోర్టు వెకేషన్ బెంచ్ న్యాయమూర్తి నియారు బిందు ఈ ఉత్తర్వులు ఇచ్చారు. గురువారం ఉదయం విచారణ సందర్భంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) తరపున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ (ఎఎస్జి) ఎస్వి రాజు వాదనలు వినిపిస్తూ బెయిల్ పిటిషన్ను వ్యతిరేకించారు. అలాగే ఎక్సైజ్ పాలసీ కేసులో కేంద్ర ఏజెన్సీ ఆరోపణలకు మనీ ట్రయల్, ఆధారాలు లేవని కేజ్రీవాల్ తరపు న్యాయవాది వాదనను వ్యతిరేకించారు. ‘ఇడి గాలిలో దర్యాప్తు చేయటం లేదు. మా వద్ద ఖచ్చితమైన ఆధారాలు ఉన్నాయి’ అని రాజు అన్నారు. కిక్బ్యాక్లుగా ఇచ్చిన డబ్బులో భాగమైన కరెన్సీ నోట్ల ఫోటోలు ఈడి వద్ద ఉన్నాయని అన్నారు. గోవాలోని సెవెన్ స్టార్ హౌటల్లో కేజ్రీవాల్ బస చేసిన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావిం చారు. హొటల్ బసను కిక్బ్యాక్ మనీ ద్వారా చెల్లించారని ఆయన వాదించారు. కేజ్రీవాల్ తన మొబైల్ ఫోన్ గురించి రహస్యంగా ఉన్నం దున ఆయనపై వచ్చిన ఆరోపణలను పరిగణలోకి తీసుకోవచ్చని కూడా వాదించారు. ‘కేజ్రీవాల్ తన పాస్వర్డ్ ఇవ్వడానికి నిరాకరించారు. ఆయన ఫోన్ ఇస్తే చాలా బయటకు వస్తాయి’ అని అన్నారు. కేజ్రీవాల్ వ్యక్తిగతంగా ఎలాంటి నేరాల్లో పాలుపంచుకోకపోయినా మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్ఎ) కింద ఆయనపై విచారణ జరపాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.
రాజకీయ నేతల చేతుల్లో కీలుబొమ్మలా ఇడి ..
కేజ్రీవాల్కు సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. రాజకీయ నేతల చేతుల్లో ఇడి కీలుబొమ్మలా వ్యవహరిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఇడి తరపున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ (ఎఎస్జి) ఎస్వి రాజుకు కౌంటర్ ఇచ్చారు. ఇడి ఆరోపణలకు ఎటువంటి ఆధారాలు లేవని పునరుద్ఘాటించారు. ‘ఇడి ఒక స్వతంత్ర ఏజెన్సీనా? లేదా కొంతమంది రాజకీయ నాయకుల చేతుల్లో ఆడుతుందా? ఇడి ఎటువంటి ఆధారాలు లేవు. వారు ఇప్పటికీ ఆధారాలు సేకరిస్తూనే ఉంటారు. అది ఎప్పటికీ ముగుస్తుంది. ఆప్ జాతీయ కన్వీనర్ అందుకే పార్టీ చేసిన ప్రతిదానికీ నేను బాధ్యత వహిస్తున్నారు. ఇది ఎల్లప్పుడూ ఊహాగానాలు, నమ్మకాల పరిధిలోనే ఉంది. రూ.100 కోట్ల లంచం అందిందని ప్రకటన చేస్తూనే ఉంటున్నాం. కానీ ఎటువంటి ఆధారం లేదు’ అని చౌదరి వాదించారు. కేజ్రీవాల్కు ఇతర వ్యక్తుల మాదిరిగానే స్వేచ్ఛను కల్పించాలని కోరారు. అనంతరం కేజ్రీవాల్ బెయిల్పై వెకేషన్ బెంచ్ న్యాయమూర్తి నియారు బిందు తీర్పును రిజర్వ్ చేశారు. సాయంత్రం బెయిల్ను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కేజ్రీవాల్ శుక్రవారం విడుదలయ్యే అవకాశం ఉంది. రూ.లక్ష బెయిల్ బాండ్ చెల్లించిన తరువాత ఆయన విడుదల కానున్నారు. ఆర్డర్పై 48 గంటల పాటు స్టే విధించాలని ఇడి కోరగా, కోర్టు తిరస్కరించింది. ఆదేశాలపై ఎటువంటి స్టే విధించమని న్యాయమూర్తి నియారు బిందు స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికలకు ముందు మార్చి 21న కేజ్రీవాల్ను మద్యం పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) అరెస్టు చేసింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆయన సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. తిరిగి ఆయన జూన్ 2న తీహార్ జైలులో లొంగిపోయిన సంగతి తెలిసిందే.