బీహార్ : బీహార్లోని పాట్నాలో ఆదివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. 17 మందితో వెళుతున్న పడవ గంగానదిలో మునిగిపోయింది. ఐదుగురు నదిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మంది ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. పాట్నా జిల్లా బార్హ్ సబ్ డివిజన్ పరిధిలోని ఉమంత ఘాట్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఆదివారం గంగా నదిలో స్నానం చేసి అవతలి ఒడ్డుకు వెళ్లేందుకు పడవ ఎక్కారు. నది మధ్యలోకి వెళ్లిన తర్వాత పడవ మునిగిపోయిందని తెలిపారు. పడవ సామర్థ్యం కన్నా ఎక్కువ మంది ఎక్కడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. సంఘటన సమాచారం తెలిసిన వెంటనే ఎన్డిఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ దళాలు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు.