లగ్జరీ వాచీల కొనుగోలు – మంత్రి పొంగులేటి కుమారుడికి కస్టమ్స్‌ సమన్లు

చెన్నై : తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు హర్షారెడ్డికి చెన్నై కస్టమ్స్‌ విభాగం సమన్లు జారీచేసింది. ఆయన డైరెక్టర్‌గా ఉన్న హైదరాబాద్‌లోని కంపెనీకి వాటిని పంపి విచారణకు హాజరవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. హర్షారెడ్డి విదేశాల నుంచి అత్యంత ఖరీదైన చేతి గడియారాలను తెప్పించినట్లు కస్టమ్స్‌ విభాగం ఆరోపించింది. ఈ నెల 4వ తేదీన తమ ఎదుట హాజరవ్వాలని సమన్లు జారీ చేయగా.. తాను డెంగీ జ్వరంతో బాధపడుతుండటంతో రాలేకపోతున్నట్లు హర్షారెడ్డి తెలిపారు. ఈనెల 27 తర్వాత కస్టమ్స్‌ అధికారుల ముందు హాజరయ్యేందుకు సుముఖత వ్యక్తం చేశారు. పిటిఐ వార్తా సంస్థ ఈ వివరాలను వెల్లడించింది. హాంకాంగ్‌లో ఉంటున్న భారతీయుడు, లగ్జరీ వాచ్‌ల డీలర్‌ ముహమ్మద్‌ ఫహేరుద్దీన్‌ ముబీన్‌ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 5న అలోకం నవీన్‌కుమార్‌ సింగపూర్‌-చెన్నై విమానంలో గడియారాలను తెచ్చాడు. అతడిపై స్మగ్లింగ్‌ కేసు నమోదైంది. ఆ వాచీల విలువ రూ.1.73 కోట్లు. వాటిని హర్షారెడ్డి కోసం తెచ్చినట్లు కస్టమ్స్‌ ఆరోపించింది. తాను హర్షారెడ్డికి, ముబీన్‌కు మధ్యవర్తిగా ఉన్నట్లు నవీన్‌కుమార్‌ తెలిపాడు. క్రిప్టో కరెన్సీ ద్వారా హర్షారెడ్డి ఆ డబ్బులు బదలాయించినట్లు విచారణలో వెలుగుచూసింది. చెన్నైలోని అలందూరు కోర్టు ఏప్రిల్‌ 1న ఇచ్చిన ఉత్తర్వుల మేరకు నవీన్‌కుమార్‌ను అరెస్టు చేయడంతోపాటు హర్షారెడ్డిని విచారించడానికి కస్టమ్స్‌ అధికారులు సన్నద్ధమయ్యారు. హర్షారెడ్డి పిటిఐతో మాట్లాడుతూ.. కస్టమ్స్‌ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని అన్నారు.

➡️