న్యూఢిల్లీ : పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పిఓకె)పై తన హక్కును భారత్ ఎన్నటికీ వదులుకోదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. దాన్ని బలవంతంగా స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం లేదని, కాశ్మీర్లో జరుగుతున్న అభివృద్ధిని చూసిన తర్వాత పిఓకె ప్రజలే భారత్లో భాగం కావాలని కోరుకుంటారని ఆయన అభిప్రాయపడ్డారు. పిటిఐకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన పై అభిప్రాయం వ్యక్తం చేశారు. జమ్ము కాశ్మీర్లో మౌలిక సదుపాయాల పరిస్థితి బాగా మెరుగుపడిందన్నారు. ఇక కేంద్ర పాలిత ప్రాంతంలో సాయుధ బలగాల ప్రత్యేక చట్టం – అఫ్సాను ఎంతోకాలం కొనసాగించాల్సిన అవసరం వుండబోదన్నారు. దీనిపై తగు సమయంలో తగు నిర్ణయాలు తీసుకుంటామన్నారు. కాశ్మీర్లో కూడా కచ్చితంగా ఎన్నికలు జరుగుతాయని, దానికి ఒక కాల పరిమితి వుందని అన్నారు.