న్యూఢిల్లీ : జమ్ముకాశ్మీర్, పంజాబ్, ఉత్తరప్రదేశ్లలో ఏకకాలంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి ) సోదాలు జరిపింది. భారత్ పేపర్స్ లిమిటెడ్ (బిపిఎల్) ముడిపడి ఉన్న రూ.200 కోట్ల బ్యాంక్ రుణాల మోసం కేసులో బుధవారం సోదాలు జరిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్ఎ) నిబంధనల ప్రకారం.. ఆయా రాష్ట్రాల్లోని తొమ్మిది ప్రాంతాల్లో సోదాలు చేపడుతోంది.
జమ్ము, లుథియానాలో ఉన్న పేపర్ బోర్డ్ ప్యాకేజింగ్ కంపెనీ భారత్ బాక్స్ ఫ్యాక్టరీ ఇండిస్టీస్ లిమిటెడ్ (బిబిఎఫ్ఐఎల్)తో 2006 సెప్టెంబర్లో బిపిఎల్ చేరింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ)తో పాటు బ్యాంకుల కన్సార్టియంతో ఆ సంస్థ డైరెక్లర్లు సుమారు రూ.200 కోట్ల బ్యాంక్ రుణాలను తీసుకుని మోసానికి పాల్పడినట్లు కేసు నమోదైనట్లు ఆ వర్గాలు తెలిపాయి. జెకె బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కరూర్ వైశ్యా బ్యాంక్ల నుండి రుణాలను తీసుకున్నట్లు వెల్లడించింది.