న్యూఢిల్లీ : పంటకు కనీస మద్దతు ధర కల్పించాలంటూ పంజాబ్ రైతుల నిరసన కార్యక్రమం ‘ఢిల్లీ ఛలో’ మంగళవారం ఉదయం ప్రారంభమైంది. ఢిల్లీ ఛలోను అడ్డుకునేందుకు రాజధానిలో సోమవారం నుండే 144 సెక్షన్ను విధించింది. సింఘు, టిక్రి మరియు ఘాజిపూర్ సరిహద్దుల్లో భారీగా పోలీసులను మోహరించారు. రైతులను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్టులు చేస్తున్నారు. లక్షలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దుకు చేరుకున్నారు. 250కి పైగా రైతు సంఘాల వేదిక కిసాన్ మజ్దూర్ మోర్చా, మరో 150కి పైగా రైతు సంఘాల వేదిక సంయుక్త కిసాన్ మోర్చా డిసెంబర్లో ఈ నిరసనకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
రెండేళ్ల క్రితమే ప్రభుత్వం తమ డిమాండ్లలో సగం రాతపూర్వకంగా నేరవేరుస్తామని హామీ ఇచ్చింది. సమస్యను శాంతియుతంగా పరిష్కరించాలని కోరామని, కానీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని అన్నారు. కాలయాపన చేయడమే పనిగా పెట్టుకున్నారని రైతు ప్రతినిధి సర్వన్ సింగ్ పంధేర్ మీడియాకు తెలిపారు.