చండీగఢ్ : రిటైర్డ్ హైకోర్టు జడ్జి పర్యవేక్షణలో తాజా ఎన్నికలు జరిపించాలని కోరుతూ ఆప్ దాఖలు చేసిన పిటిషన్పై పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు బుధవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మూడు వారాల్లోగా తమ స్పందను తెలియజేయాల్సిందిగా చండీగఢ్ పరిపాలన, మునిసిపల్ కార్పోరేషన్కు నోటీసులిచ్చింది. చండీగఢ్ మునిసిపల్ కార్పోరేషన్లోని 35 మంది సభ్యుల సభలో కాంగ్రెస్, ఆప్ విజయం సాధిస్తుందని అంచనావేసిన సంగతి తెలిసిందే. అయితే జనవరి 30న జరిగిన మేయర్ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్ కూటమి కొన్ని స్థానాలకు పరిమితం కాగా, అనూహ్యంగా బిజెపి విజయం సాధించింది. ఈ ఎన్నిక చెల్లదని, తాజా ఎన్నికలు కోరుతూ హైకోర్టును ఆశ్రయిస్తామని ఆప్ పేర్కొంది.
మేయర్ అభ్యర్థి, ఆప్ కౌన్సిలర్ కులదీప్ కుమార్ ఈ పిటిషన్ను దాఖలు చేశారు. ఈ ఎన్నిక ప్రక్రియ పూర్తి మోసం, ఫోర్జరీ అని, ఈ ఎన్నిక ప్రక్రియను రద్దు చేయాలని కులదీప్ కుమార్ కోర్టును కోరారు. కొత్తగా ఎన్నికైన మేయర్ విధులను నిర్వర్తించకుండా చండీగఢ్ మునిసిపల్ కార్పోరేషన్ నిరోధించేలా సూచనలివ్వాలని పిటిషన్లో కోరారు. ప్రిసైడింగ్ అధికారి అనిల్ మసీహ్ బ్యాలెట్ పత్రాలను ట్యాంపరింగ్ చేశారని ప్రతిపక్ష కౌన్సిలర్లు మండిపడ్డారు.