- 4న వింటామన్న రౌస్ ఎవెన్యూ కోర్టు
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై రౌస్ ఎవెన్యూ కోర్టు విచారణను ఈ నెల 4కు వాయిదా వేసింది. ఆలోపు బెయిల్ పిటిషన్పై ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఇడి) కౌంటర్కు రిజాయిండర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అలాగే కవిత తరపు న్యాయవాది నతీశ్ రానా విజ్ఞప్తి మేరకు… తీహార్ జైలులో ఆమెకు హోంఫుడ్, జపమాల, బుక్స్, ఒక జత బూట్లు (లేస్ లేని), మెడిటేషన్కు అనుమతినిచ్చేలా జైలు సిబ్బందికి ఆదేశాలిస్తామని స్పెషల్ జడ్జి కావేరి బవేజా పేర్కొన్నారు. గత నెల 15న హైదరాబాద్లో కవితను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు.. తర్వాతి రోజు ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు ముందు హాజరుపరిచారు. రెండు దశలుగా ట్రయల్ కోర్టు కవితకు విధించిన 10 రోజుల ఇడీ కస్టడీ ముగియడంతో… గత నెల 26న ఆమెను మరోసారి కోర్టు ముందు హాజరుపరిచారు. అనంతరం కవితకు ఈ నెల 9 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ కోర్టు ఉత్తర్వులిచ్చిన విషయం తెలిసిందే.