మోడీ బస చేశారు… బిల్లు కట్టండి

  •  ప్రభుత్వానికి మైసూర్‌ హోటల్‌ నోటీసు

మైసూర్‌ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తమ హోటల్‌లో బస చేసి.. 80 లక్షల రూపాయల బిల్లు చెల్లించనందుకుగాను చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు మైసూర్‌ రాడిసన్‌ బ్లూ ప్లాజా హోటల్‌ యాజమాన్యం హెచ్చరించింది. వివరాల్లోకి వెళితే.. ప్రధాని మోడీ గతేడాది ఏప్రిల్‌ నెలలో నేషనల్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ అథారిటీ (ఎన్‌టిసిఎ), పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వశాఖ (ఎంఓఇఎఫ్‌) ఆధ్వర్యంలో నిర్వహించిన 50 సంవత్సరాల ‘ప్రాజెక్టు టైగర్‌’ ఈవెంట్‌ మైసూర్‌లో జరిగింది. ఈ కార్యక్రమం ఏప్రిల్‌ 9 నుంచి 11 వరకు జరిగింది. ఈ ఈవెంట్‌ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్రమోడీ మైసూర్‌కి వచ్చి అక్కడ ఉన్న రాడిసన్‌ బ్లూ ప్లాజా హోటల్‌లో బస చేశారు. దీనికిగానూ రూ. 80.6 లక్షల రూపాయల బిల్‌ అయింది. కాని, ఈ బిల్లుని హోటల్‌కి చెల్లించలేదు. ఈ బకాయిలను చెల్లించాలని కర్ణాటక ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్స్‌ (వైల్డ్‌ లైఫ్‌).. న్యూఢిల్లీ ఎన్‌టిసిఎ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌కి లేఖ రాసింది. అయితే ఈ హోటల్‌ బకాయిలను కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలని ఎన్‌టిసిఎ తిరిగి ఈ ఏడాది ఫిబ్రవరి 12న లేఖ రాసింది. బకాయిలు చెల్లించకపోవడంతో మరోసారి మార్చి 22 2024వ తేదీన ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌ (పిసిసిఎఫ్‌) ప్రిన్సిపల్‌ సుభాష్‌ కె. మల్ఖేడే ఎన్‌టిసిఎకు లేఖ రాశారు. సుభాష్‌ రాసిన లేఖకు సంబంధించి ఎన్‌టిసిఎ సమాధానం ఇవ్వలేదు. ఆ తర్వాత ‘ఏడాది గడిచినా హోటల్‌లో బస చేసినందుకు బిల్లు చెల్లించలేదు’ అని మే 21న ఈ హోటల్‌ ఫైనాన్స్‌ జనరల్‌ మేనేజర్‌ డిప్యూటీ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ చీఫ్‌ బసవరాజుకు లేఖ రాశారు. బకాయిలు సరైన సమయంలో చెల్లించనందుగాను 12.09 లక్షలు, మొత్తం డబ్బు సంవత్సరానికి 18 శాతం వడ్డీతో కలిపి చెల్లించాలని బ్లూ ప్లాజా యాజమాన్యం లేఖలో పేర్కొంది. ఈ బకాయిల్ని ఈ ఏడాది జూన్‌ 1వ తేదీ లోపు చెల్లించని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హోటల్‌ యాజమాన్యం హెచ్చరించింది. అయితే ఈ కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం నిర్వహించిందన్న కారణంతో.. రాష్ట్ర ప్రభుత్వం ఈ హోటల్‌కి చెల్లించే బకాయిల్ని చెల్లించేందుకు తిరస్కరించిందని ఫారెస్ట్‌ చీఫ్‌ బసవరాజు అన్నారు.

➡️