ముంబై : భర్త తన తల్లితో సమయం గడపడం, ఆమెకు డబ్బు ఇవ్వడం గృహ హింస కాదని ముంబైలోని సెషన్స్ కోర్టు పేర్కొంది. మెజిస్ట్రేట్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ మహిళ దాఖలు చేసిన పటిషన్ను సెషన్స్ కోర్టు కొట్టివేసింది. ఈ సంఘటన ముంబైలో జరిగింది. ఆ రాష్ట్ర సచివాలయంలో అసిస్టెంట్గా పనిచేస్తున్న మహిళ తన భర్త, అత్తమామలపై గృహ హింస కింద కోర్టును ఆశ్రయించింది. తల్లి మానసిక ఆరోగాన్ని దాచి తన భర్త తనను పెళ్లి చేసుకున్నాడని ఆ మహిళ ఆరోపించింది. తాను ఉద్యోగం చేయడాన్ని అత్త వ్యతిరేకించిందని, భర్త, అత్త కలిసి తనను వేధిస్తున్నారని ఆమె పిటిషన్లో పేర్కొంది. తన భర్త సెప్టెంబర్ 1993 నుంచి డిసెంబర్ 2004 వరకు ఉద్యోగం నిమిత్తం విదేశాల్లో ఉన్నాడని, సెలవుపై భారత్కు వచ్చినప్పుడల్లా ఆయన తన తల్లిని కలిసేవాడని, ఆమెకు ప్రతి ఏటా పదివేల రూపాయలు పంపేవాడని ఆ మహిళ ఆరోపించింది. తన తల్లి కంటి ఆపరేషన్ కోసం డబ్బులు కూడా ఖర్చు చేశాడని, అత్తింటి కుటుంబంలోని ఇతర సభ్యులు కూడా వేధింపులకు గురిచేస్తున్నారని ఆమె ఆరోపించింది. గృహ హింస, మహిళల రక్షణ చట్టం కింద రక్షణ కల్పించాలని, పరిహారం ఇప్పించాలని మెజిస్ట్రేట్ కోర్టును కోరింది.
ఇక భార్య తనపై చేసిన ఆరోపణలను భర్త కోర్టుకి తెలిపాడు. తన భార్య తనను ఎన్నడూ భార్యగా అంగీకరించలేదని, తనపై తప్పుడు ఆరోపణలు చేసేదని ఆ వ్యక్తి కోర్టుకి తెలిపాడు. ఆమె క్రూరత్వం కారణంగా ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేసినట్లు పేర్కొన్నాడు. అలాగే తనకు చెప్పకుండా తన ఎన్ఆర్ఈ ఖాతా నుంచి రూ. 21.68 లక్షలు విత్డ్రా చేసి, ఆ డబ్బుతో ఫ్లాట్ కొనుగోలు చేసిందని ఆమె భర్త ఆరోపించాడు. మరోవైపు ఆ మహిళ అభ్యర్థనపై విచారణ పెండింగ్లో ఉన్న సమయంలో ట్రయల్ కోర్టు ఆమెకు నెలకు రూ. 3,000 మధ్యంతర భరణాన్ని మంజూరు చేసింది. అయితే పూర్తి ఆధారాలు పరిశీలించిన తర్వాత గృహ హింస కింద ఆమె దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. అలాగే మధ్యంతర భరణాన్ని రద్దు చేసింది. దీంతో ఆమె మెజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలను ముంబైలోని సెషన్స్ కోర్టులో సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. చేసింది. ఈ పిటిషన్పై విచారణ జరిపిన సెషన్స్ కోర్టు కోర్టు ఒక వ్యక్తి తన తల్లికి సమయం, డబ్బు ఇవ్వడం గృహ హింసగా పరిగణించబోమని పేర్కొంది. తగిన ఆధారాలు లేవంటూ ఆ మహిళ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది.