న్యూఢిల్లీ : ‘ క్రిమినల్ ‘ బిల్లులోని కొన్ని నిబంధనలను సవాలు చేస్తూ ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్, ఇన్క్లూజివ్ అలయన్స్ (ఇండియా) ఫోరమ్ సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. బుధవారం రాజ్యసభలో ప్రతిపక్షనేత మల్లికార్జున్ ఖర్గే ఏర్పాటు చేసిన ఇండియా ఫోరమ్ నేతల సమావేశంలో ఈ అంశంపై చర్చించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. పి. చిదంబరం, అభిషేక్ సింఘ్వీ, మనీష్తివారీ వంటి న్యాయవాదులను పార్లమెంటు ఉభయ సభల్లో ఈ బిల్లుపై చర్చకు దింపాలని ఫోరమ్ భావించింది. అయితే కేంద్రం ఏకపక్ష సస్పెన్షన్తో ఇండియా ఫోరమ్ సభ్యులు సమావేశాలకు దూరమయ్యారు.
క్రిమినల్ బిల్లులోని కొన్ని నిబంధనలు ‘పోలీస్ రాజ్యం’కి దారితీస్తాయని వాదిస్తున్నాయి. ఈ మూడు క్రిమినల్ బిల్లులు భారతదేశాన్ని నిరంకుశ పోలీస్ రాజ్యంగా మార్చడానికి పునాదులు వేస్తాయని కాంగ్రెస్ ఎంపి మనీష్ తివారీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై న్యాయవాదుల వివరణలను చర్చ జరపకుండా బిల్లును ఆమోదించేందుకు ప్రతిపక్ష సభ్యులను ప్రభుత్వం సస్పెండ్ చేసిందని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ (కమ్యూనికేషన్ ) జైరాం రమేష్ ఎక్స్లో పోస్ట్ చేశారు. భారతీయ న్యారు (రెండవ) సంహిత (బిఎన్ఎస్), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బిఎన్ఎస్ఎస్), భారతీయ సాక్ష్యాధార (బిఎస్) చట్టాలను తీసుకువచ్చేందుకు అదే పేర్లతో మూడు కొత్త బిల్లులను లోక్సభ బుధవారం ఆమోదించిన సంగతి తెలిసిందే.