భారత సంతతి కంప్యూటర్‌ ఇంజినీర్‌కు ప్రతిష్టాత్మక అవార్డు

టెక్సాస్‌: భారత సంతతికి చెందిన రీసెర్చర్‌ కంప్యూటర్‌ ఇంజినీర్‌ అశోక్‌ వీరరాఘవన్‌కు అమెరికాలో ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. టెక్సాస్‌లో అత్యున్నత అకడమిక్‌ అవార్డుగా పేరొందిన ఎడిత్‌ అండ్‌ పీటర్‌ ఓ డన్నెల్‌ అవార్డును వీరరాఘవన్‌కు దక్కింది. ద టెక్సాస్‌ అకాడమీ ఆఫ్‌ మెడిసిన్‌, ఇంజినీరింగ్‌, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ(టామ్‌సెట్‌) ఏటా అత్యుత్తమ పరిశోధనలు చేసిన వారికి ఈ అవార్డును ప్రతి ఏటా అందజేస్తుంది.

అశోక్‌ వీర రాఘవన్‌ హూస్టన్‌లోని రైస్‌ యూనివర్సిటీకి చెందిన జార్జ్‌ ఆర్‌.బ్రౌన్‌ స్కూల్‌లో ఎలక్ట్రికల్‌ అండ్‌ కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఇమేజింగ్‌ టెక్నాలజీలో చేసిన పరిశోధనలకుగాను వీరరాఘవన్‌ను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. అవార్డు అందుకున్న సందర్భంగా వీరరాఘవన్‌ మీడియాతో మాట్లాడుతూ ఃఅవార్డు అందుకోవడం నాకు ఆనందంగా ఉంది. రైస్‌ యూనివర్సిటీ ల్యాబ్‌లో అనేకమంది విద్యార్థులు, పరిశోధన శాస్త్రవేత్తలు చేసిన వినూత్న పరిశోధనలకు ఈ అవార్డు గుర్తింపు. ప్రస్తుత ఇమేజింగ్‌ టెక్నాలజీలో చాలా సమస్యలున్నాయి. కాంతి ప్రసరించకుండా అడ్డంకులున్నచోట మనకు కావాల్సిన వాటిని చూడలేకపోతున్నాం. దీనిని అధిగమించేందుకు మేం చేసిన పరిశోధనలు చాలా వరకు పరిష్కారాన్ని కనుగొన్నాయి. ఉదాహరణకు కారు నడుపుతుంటే పొగమంచు వల్ల కాంతి పడకపోవడంతో ఎక్కువ దూరం రోడ్డును చూడలేకపోతున్నాం. విజిబిలిటీకి సంబంధించి ఇలాంటి సమస్యలు ఇక ముందు ఉండకపోవచ్చుఃఅని ఆయన అన్నారు. అశోక్‌ వీరరాఘవన్‌ చెన్నైకి చెందినవాడు. తన బాల్యాన్ని చెన్నైలోనే గడిపారు.

➡️