తొలిసారి కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఒప్పుకోలు
న్యూఢిల్లీ : నీట్ పరీక్షలో కొన్ని అక్రమాలు జరిగాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తొలిసారి అంగీకరించారు. ఆదివారం ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ రెండుచోట్ల అక్రమాలు జరిగినట్లు వెలుగులోకి వచ్చిందని తెలిపారు. ఈ విషయాన్ని ప్రభుత్వం తీవ్రంగా తీసుకుంటుందని విద్యార్థులకు, తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టిఎ)లో చాలా మెరుగుదల అవసరమని మంత్రి అంగీకరించారు. ఎన్టిఎలోని పెద్దలు ఎవరైనా దోషులుగా తేలినా వారిని విడిచిపెట్టబోమని చెప్పారు. ప్రభుత్వం ఈ విషయంపై తీవ్రంగా ఉందని, ఏ దోషినీ విడిచిపెట్టదని, దోషులకు కఠినశిక్ష పడుతుందని తెలిపారు. సుప్రీంకోర్టు సిఫార్సుల మేరకు 1,563 మంది అభ్యర్థులకు మరోసారి పరీక్ష నిర్వహించడం కోసం ఉత్తర్వులు జారీ చేసినట్లు చెప్పారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/06/41-4.jpg)