డిప్యూటీ స్పీకర్‌ పదవి ఇస్తే సరే!

Jun 15,2024 23:40 #18th Lok Sabha, #First Sessions

లేకుంటే స్పీకర్‌ స్థానానికి పోటీ
ప్రతిపక్షాల యోచన
న్యూఢిల్లీ : 18వ లోక్‌సభ తొలి సమావేశాలు ఈనెల 24 నుంచి ప్రారంభం కానున్నాయి. 26న లోక్‌సభ కొత్త స్పీకర్‌ను ఎన్నుకోనున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు కూడా తమకు డిప్యూటీ స్పీకర్‌ పదవి ఇవ్వకపోతే, స్పీకర్‌ పదవికి తమ అభ్యర్థిని నిలబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో వారం రోజుల్లో పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అంతకుముందే దీనిపై తుది నిర్ణయం తీసుకోవాలని ప్రతిపక్షాలు నిర్ణయించినట్టు సంకేతాలు వస్తున్నాయి.
గత ఐదేళ్లుగా ఖాళీగా డిప్యూటీ స్పీకర్‌ పదవి
17వ లోక్‌సభలో ఐదేళ్లపాటు డిప్యూటీ స్పీకర్‌ పదవి ఖాళీగా ఉంది. సాధారణంగా డిప్యూటీ స్పీకర్‌ పదవిని ప్రతిపక్షాలకు ఇస్తారు. బిజెపికి మెజార్టీ ఉండటంతో, అంతా తానే అన్నట్టుగా వ్యవహరించిన మోడీ చివరి వరకూ ఆ సీటును ఖాళీగానే ఉంచారు.
బిజెపి అభ్యర్థికి జెడియు, టిడిపి మద్దతు
టిడిపి, జెడియు… బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ కూటమిలో భాగమని, లోక్‌సభ స్పీకర్‌ పదవికి బిజెపి ప్రతిపాదించిన అభ్యర్థికే మద్దతిస్తామని జనతాదళ్‌ (యునైటెడ్‌) నాయకుడు కెసి త్యాగి ముందుగానే చెప్పారు.
కొత్త లోక్‌సభ స్పీకర్‌ టిడిపి లేదా జెడియు నుంచి కావచ్చనే చర్చ కూడా నడుస్తోంది. ఎన్‌డిఎ భాగస్వామ్య పక్షాలైన టిడిపి, జెడియుల నుంచి లోక్‌సభ స్పీకర్‌ను నియమించాలని ఆప్‌ సూచించింది. ఇది తమ ప్రయోజనాలతోపాటు రాజ్యాంగం, ప్రజాస్వామ్యానికి కూడా మేలు చేస్తుందని పేర్కొంది.
24న సెషన్‌ ప్రారంభం
18వ లోక్‌సభ తొలి సెషన్‌ ఈ నెల 24న ప్రారంభమై జులై 3న ముగుస్తుందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్‌ రిజిజు తెలిపారు. తొమ్మిది రోజుల ప్రత్యేక సెషన్‌లో మొదటి మూడు రోజుల్లో కొత్తగా ఎన్నికైన పార్లమెంటు సభ్యులు (ఎంపీలు) ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం లోక్‌సభ స్పీకర్‌ను ఎన్నుకుంటారు.
మోడీ ప్రభుత్వం ఐదేళ్ల రూట్‌మ్యాప్‌ను ఖరారు చేసింది. రాష్ట్రపతి ప్రసంగం అనంతరం ప్రధాని మోడీ దీన్ని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు.
మరోపక్క రాజ్యసభ 264వ సమావేశాలు జూన్‌ 27 నుంచి జూలై 3, 2024 వరకు జరగనున్నాయి. 2014 తర్వాత బిజెపి తక్కువ బలంతో అధికారంలోకి రావడం ఇదే తొలిసారి. జూన్‌ 27న ఉభయ సభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు.
234 మందికి పైగా సభ్యులతో చాలా కాలంగా తర్వాత ప్రతిపక్షం బలమైన స్థానాన్ని సంపాదించుకున్నది. లోక్‌సభలో 99 మంది ఎంపీలను కలిగి ఉన్న కాంగ్రెస్‌, స్టాక్‌ మార్కెట్‌ స్కామ్‌, నీట్‌ పరీక్షలో అవకతవకల ఆరోపణలపై ఇప్పటికే ప్రభుత్వంపై దాడి చేస్తున్నది. దీనివల్ల వచ్చే పార్లమెంట్‌ సమావేశాలు మరింత ఆసక్తికరంగా మారే అవకాశం ఉన్నదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

➡️