karnataka: జెడిఎస్ నేత హెచ్‌.డి. రేవణ్ణపై కిడ్నాప్‌ కేసు ..

బెంగళూరు :    కర్ణాటకలో జెడి(ఎస్‌) నేత హెచ్‌.డి. రేవణ్ణపై కేసు నమోదైంది. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్‌డిఎ అభ్యర్థి, తన కుమారుడు ప్రజ్వల్‌ రేవణ్ణ లైంగిక వేధింపులకు పాల్పడిన బాధితురాలిలో ఒకరిని కిడ్నాప్‌ చేసినట్లు ఆయనపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. బాధితురాలు గతంలో హెచ్‌డి రేవణ్ణ ఇంట్లో పనిమనిషిగా ఆరేళ్ల పాటు పనిచేసిందని, ప్రజ్వల్‌ రేవణ్ణ ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు ఇటీవల విడుదలైన వీడియోల్లో ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి. కిడ్నాపైన మహిళ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. తనపై అత్యాచారానికి పాల్పడిన ప్రజ్వల్‌ రేవణ్ణకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పకుండా అడ్డుకునేందుకు ఆమెను కిడ్నాప్‌ చేశారని పోలీసులు తెలిపారు.

బాధితురాలి కుమారుడు గురువారం సాయంత్రం మైసూరు జిల్లాలోని కె.ఆర్‌. నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఏప్రిల్‌ 29న కె.ఆర్‌. నివాసి అయిన సతీష్‌ బాబన్న ఆమెను బలవంతంగా హెచ్‌.డి. రేవణ్ణ నివాసానికి తీసుకెళ్లారని, అప్పటి నుండి కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వవద్దని ఏప్రిల్‌ 26న కూడా తమ ఇంటికి వచ్చి తన తల్లిదండ్రులను బెదిరించారని తెలిపారు. గతంలో ఆరేళ్ల పాటు తన తల్లి హెచ్‌.డి. రేవణ్ణ ఇంట్లో పనిచేశారని, మూడేళ్ల క్రితం గ్రామానికి తిరిగి వచ్చారని అన్నారు. హెచ్‌.డి. రేవణ్ణ ఆదేశాల మేరకు సతీష్‌ బాబన్న తన తల్లిని కిడ్నాప్‌ చేశారని, ఆమె ప్రాణాలకు ముప్పు ఉందని పేర్కొన్నారు. తన తల్లిని రక్షించాలని, వారిద్దరిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నాను అని ఫిర్యాదుదారు తెలిపారు.

అయితే  లైంగిక వేధింపుల కేసులో  హెచ్‌డి. రేవణ్ణ ముందస్తు బెయిల్‌ కోరారు.   బెంగళూరులోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో నేడు ఆయన విచారణకు హాజరుకానున్నారు.  రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్ రేవణ్ణ   దేశం నుండి పరారైన సంగతి తెలిసిందే.

➡️