సీతాపూర్ (యుపి) : కాంగ్రెస్, ఇండియా బ్లాక్లు తమను పావులుగా వాడుకుంటున్నాయని ముస్లింలు ఇప్పుడు అర్థం చేసుకున్నారని ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం వ్యాఖ్యానించారు. బిజెపి చేస్తున్న అభివృద్ధిని చూసిన తర్వాత వారు ఆ రెండింటికీ దూరంగా వుంటున్నారని అన్నారు. దౌరహరలో బిజెపి అభ్యర్ధికి మద్దతుగా ఎన్నికల సభలో ఆయన ప్రసంగిస్తూ, నిరుపేదలు, ఎస్సి, ఎస్టి, ఒబిసిలకు చెందిన వారు అందరూ బిజెపివైపే వస్తున్నారన్నారు. ప్రధాని గృహనిర్మాణ పథకం కింద అవసరంలో వున్నవారందరికీ ఇళ్లు కేటాయించడాన్ని ముస్లిం సోదరులు, సోదరీమణులు చూస్తున్నారని అన్నారు. నీటి కనెక్షన్ కానివ్వండి, గ్యాస్ సిలిండర్ కానివ్వండి ప్రతి ప్రభుత్వ ప్రయోజనం అందరికీ ఇస్తున్నామన్నారు. ఎలాంటి వివక్ష లేకుండా ముస్లింలందరూ అన్ని పథకాల ప్రయోజనాలు పొందుతున్నారన్నారు. నిజం తెలుసుకున్నారు కనుకనే ఈ ఓటుబ్యాంక్ రాజకీయాల కాంట్రాక్టర్లకు ముస్లింలు దూరంగా వుంటున్నారని మోడీ అన్నారు. మతం ప్రాతిపదికన రిజర్వేషన్లు వుండొద్దని అంబేద్కర్, జవహర్లాల్ నెహ్రూ చాలా స్పష్టంగా చెప్పారని, కానీ మతం ప్రాతిపదికనే రిజర్వేషన్లు ఇచ్చేందుకు కాంగ్రెస్, ఇండియా బ్లాక్ గట్టి పట్టుతో వున్నాయని మోడీ అన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/04/pm-modi-7.jpg)