న్యూఢిల్లీ : యాపిల్ సంస్థ హెచ్చరికలు వాస్తవమని ప్రకటించిన ‘ఆమెస్టీ, వాషింగ్టన్ పోస్ట్’ లను కేంద్రం మరోసారి తోసిపుచ్చింది. కేంద్ర సమాచార సాంకేతిక మంత్రి రాజీవ్ చంద్రశేఖరన్ ‘వాషింగ్టన్ పోస్ట్’ ను ఖండిస్తున్నట్లు శుక్రవారం ఎక్స్లో పేర్కొన్నారు. ఇది వాస్తవ దూరమని, కల్పితమని ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగా రాజకీయ ప్రత్యర్థులు, పాత్రికేయులు, మానవహక్కుల కార్యకర్తలపై నిఘా పెట్టేందుకు మోడీ ప్రభుత్వం పెగాసెస్ స్పైవేర్ను ప్రయోగిస్తోందంటూ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, వాషింగ్టన్ పోస్ట్ సంయుక్తంగా జరిపిన పరిశోధనలో వెల్లడైనట్లు గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ది వైర్ పోర్టల్ వ్యవస్థాపక సంపాదకుడు సిద్ధార్థ వరదరాజన్, ది ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ (ఒసిసిఆర్పి)కి చెందిన ఆనంద్ మంగ్నాలేలకు చెందిన ఐఫోన్లలో అక్టోబర్లో పెగాసెస్ స్పైవేర్ను అమర్చారని, ఇందుకోసం గుర్తుతెలియని ప్రభుత్వ సంస్థను వాడుకున్నారని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తెలిపింది. ఇజ్రాయిల్లో రూపుదిద్దుకున్న పెగాసెస్ను వరదరాజన్కు వ్యతిరేకంగా వినియోగించడం ఇది రెండోసారి.
![](https://prajasakti.com/wp-content/uploads/2023/12/MoS.jpg)