ముంబై : మానవ అక్రమ రవాణా అనుమానంతో ఫ్రెంచ్ అధికారులు అదుపులోకి తీసుకొన్న విమానం మంగళవారం ఉదయం ముంబైలో ల్యాండ్ అయింది. ఈనెల 22న రొమేనియాకు చెందిన లెజెండ్ ఎయిర్లైన్స్ విమానం ప్రయాణికులతో దుబాయి నుంచి నికరాగువాకు బయల్దేరింది. మార్గమధ్యలో ఇంధనం కోసం వాట్రీ విమానాశ్రయంలో ఆగినపుడు విమానంలో మానవ అక్రమ రవాణా జరుగుతున్నట్లు ఫ్రాన్స్ అధికారులకు అనుమానం వచ్చి విమానాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అనంతరం ఫ్రాన్స్ ఎయిర్పోర్టులోనే నలుగురు న్యాయమూర్తుల బృందం విచారణ జరిపింది. అన్ని న్యాయపరమైన ప్రక్రియలు పూర్తి చేసిన తర్వాత విమానం ముంబైకి బయల్దేరేందుకు అనుమతి లభించింది. దీనిపై ఫ్రాన్స్లోని భారత రాయబార కార్యాలయం కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ విషయంలో అధికారులు త్వరితగతిన స్పందించారని వెల్లడించింది. ఈ ఘటనపై భారత ప్రభుత్వం తదుపరి చర్యలు చేపట్టనుంది. ఇద్దరు మైనర్లు సహా 25 మంది ఫ్రాన్స్ ఆశ్రయం కోరడంతో వారిని అక్కడే ఉంచారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2023/12/flight-1.jpg)