- రాజ్యసభలో కేంద్ర మంత్రి ఫగన్ సిమగ్ కులస్తే
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి సేకరించిన భూములను ఆ కర్మాగారానికి బదలీ చేసే ప్రతిపాదన ఏదీ లేదని ఉక్కు శాఖ మంత్రి ఫగన్ సింగ్ కులస్తే స్పష్టం చేశారు. రాజ్యసభలో సోమవారం వైసిపి ఎంపి వి విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం తెలిపారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం సేకరించిన భూములను ఆ ప్లాంట్కు బదలాయించడం ద్వారా దాని ఆస్తుల విలువను, రుణ శక్తిని పెంపొందించడానికి అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం అందుకు నిరాకరించడానికి కారణాలు ఏమిటి… అంటూ విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. దీనికి మంత్రి వివరణ ఇస్తూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ (రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్) ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వం భూములను సేకరించి అప్పగించింది. తదనంతరం ఆ భూములపై సర్వహక్కులను కేంద్ర ఉక్కు మంత్రిత్వశాఖకు బదలాయించడం జరిగింది. స్టీల్ ప్రాజెక్టు కోసం ఆ భూములను వినియోగించుకో వడానికి వీలుగా ఉక్కు మంత్రిత్వశాఖ ఆర్ఐఎన్ఎల్కు పవర్ ఆఫ్ అటార్నీ జారీ చేసింది. అందువలన ఆ భూములపై యాజమాన్య హక్కులను ఆర్ఐఎన్ఎల్కు బదిలీ చేసే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం వద్ద లేదని మంత్రి స్పష్టం చేశారు.రౌర్కెలా స్టీల్ ప్లాంట్ మినహా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) దేశంలోని వివిధ ప్రాంతాల్లో నెలకొల్పిన స్టీల్ ప్లాంట్ల భూములపై సర్వ హక్కులు ఆయా ప్లాంట్ల పేరిట దఖలు పడి ఉన్నట్లు ఉక్కుశాఖ మంత్రి తెలిపారు. భిలారు స్టీల్ ప్లాంట్, బొకారో స్టీల్ ప్లాంట్, దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్, ఇస్కో స్టీల్ ప్లాంట్, సేలం స్టీల్ ప్లాంట్ అలారు స్టీల్ ప్లాంట్, విశ్వేశ్వరయ ఐరన్, స్టీల్ ప్లాంట్లు నెలకొల్పిన భూములకు ఆయా ప్లాంట్లే యాజమాన్య హక్కులు కలిగి ఉన్నాయి. రౌర్కెలా స్టీల్ ప్లాంట్ భూములు మాత్రం లీజు పద్ధతిలో కొనసాగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు.