కదంతొక్కిన ఆదివాసీలు : సిపిఎం ఆధ్వర్యంలో ఝార్ఖండ్‌లో వేలాది మంది ర్యాలీ

Nov 18,2023 10:12 #Jharkhand, #tribals

 

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : అమరవీరుడు బిర్సా ముండా జయంతిని పురస్కరించుకుని శుక్రవారం ఝార్ఖండ్‌లోని రాంచీ జిల్లా బుండులో ఆదివాసీలు కదంతొక్కారు. సిపిఎం ఆధ్వర్యాన వేలాది మంది ఆదివాసీలు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహిళలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. బహిరంగ సభలో సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు, ఎఐకెఎస్‌ అధ్యక్షులు అశోక్‌ ధావలే పాల్గొన్నారు. సిపిఎం ఝార్ఖండ్‌ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్‌ విప్లవ్‌, సిపిఎం, సిఐటియు, ఎఐకెఎస్‌, ఐద్వా నాయకులు సురేష్‌ ముండా, సుఫల్‌ మహతో, రంగోవతి దేవి, సుఖ్‌నాథ్‌ లోహారా, భవన్‌ సింగ్‌, వీణా లిండా తదితరులు ప్రసంగించారు. రెండు రోజుల క్రితం ఝార్ఖండ్‌లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోడీ ఆదివాసీల హక్కుల గురించి మాట్లాడలేదని విమర్శించారు. ఆదివాసీల భూమిని కార్పొరేట్లు స్వాధీనం చేసుకునేందుకు వీలుగా అటవీ సంరక్షణ చట్టంలో తిరోగమన గిరిజన వ్యతిరేక సవరణలు చేశారని దుయ్యబట్టారు. విపరీతమైన ధరల పెరుగుదల, నిరుద్యోగానికి దారితీసిన బిజెపి విధానాలను, దేశాన్ని కార్పొరేట్లకు అమ్మే ప్రయత్నం, ప్రజలను మతం, కులాల ప్రాతిపదికన విభజించే మతతత్వ కుట్రలను నేతలు విమర్శించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బిజెపిని ఓడించాలని, వామపక్షాలను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.

➡️