న్యూఢిల్లీ: మణిపూర్లో మళ్లీ హింస చెలరేగింది. టెంగ్నౌపాల్ జిల్లా సైబాల్ సమీపంలోని లీతూ గ్రామంలో రెండు తెగలకు చెందిన జనం మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఒకరినొకరు కర్రలు, రాళ్లతో కొట్టుకున్నారు. తుపాకులతో కాల్చుకున్నారు. ఈ ఘర్షణల్లో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఘర్షణలు జరుగుతున్నట్లు సమాచారం అందగానే తాము ఘటనా ప్రాంతానికి వెళ్లామని, అప్పటికే అక్కడ 13 మృతదేహాలు పడి ఉన్నాయని భద్రతాధికారులు తెలిపారు. ఈ ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయిన వారు లీతూ గ్రామానికి చెందిన వారు కాదని అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది. వేరే ప్రాంతం నుంచి వచ్చిన ఈ గ్రూప్.. గ్రామంలోని మరో తెగకు చెందిన గ్రూప్తో ఘర్షణకు దిగిందని భద్రతాధికారులు చెప్తున్నారు. స్థానికులు కాకపోవడంతో మరణించిన 13 మంది ఎవరనేది ఇంకా గుర్తించలేదు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఏడాది మే 3 నుంచి మణిపూర్లోని మైతీ, కుకీ తెగల మధ్య చెలరేగిన ఘర్షణల్లో 182 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 50 వేల మంది నివాసాలను కోల్పోయారు. ఇటీవల పరిస్థితి అదుపులోకి రావడంతో ఆదివారం ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించారు. ఇంతలోనే తెగల నడుమ ఘర్షణలు చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది.