విశాఖ ఉక్కు అమ్మకానికి ఇఒఐ జారీ చేయలేదు

  • రాజ్యసభలో జ్యోతిరాదిత్య సింధియా

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : విశాఖపట్నం ఉక్కు కర్మాగారం (ఆర్‌ఐఎన్‌ఎల్‌) అమ్మకానికి ఇఒఐ (ఆసక్తి వ్యక్తీకరణ) జారీ చేయలేదని కేంద్ర ఉక్కుశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. సేలం స్టీల్‌ ప్లాంట్‌, దుర్గాపూర్‌ అల్లారు స్టీల్‌ ప్లాంట్‌, భద్రావతిలోని విశ్వేశ్వరాయ స్టీల్‌ ప్లాంట్లలో పెట్టుబడుల ఉపసంహరణను ప్రభుత్వం ఉపసంహరించుకున్న నేపథ్యంలో విశాఖ ఉక్కు కర్మాగారం విక్రయానికి సంబంధించి కొనుగోలుదార్ల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ (ఇఒఐ) జారీ చేసే ప్రక్రియను ప్రభుత్వం విరమించుకున్నదా? అని రాజ్యసభలో సోమవారం వైసిపి ఎంపి విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. విశాఖ ఉక్కు విక్రయానికి ఇఒఐ జారీ చేయలేదని తెలిపారు. పెట్టుబడుల ఉపసంహరణ చేపట్టే సమయం, అందుకు నిర్దేశించిన ధర, విక్రయానికి సంబంధించిన నియమ నిబంధనలు, నాన్‌-కోర్‌ అసెట్స్‌, మైన్స్‌, అనుబంధ పరిశ్రమలు, యూనిట్లు, జాయింట్‌ వెంచర్లలో ఆర్‌ఐఎన్‌ఎల్‌ వాటా వంటి అంశాలు పరిగణనలోనికి తీసుకున్న తర్వాత మాత్రమే విశాఖ ఉక్కులో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియకు శ్రీకారం చుట్టాలని ప్రభుత్వం స్పష్టం చేసినట్లు మంత్రి చెప్పారు. సేలం స్టీల్‌, దుర్గాపూర్‌ స్టీల్‌ ప్లాంట్‌, భద్రావతి స్టీల్‌ ప్లాంట్లలో పెట్టుబడుల ఉపసంహరణపై బిడ్డర్లు ఆసక్తి చూపనందునే ఆయా స్టీల్‌ ప్లాంట్ల విక్రయ ప్రతిపాదనలను ఉపసంహరించుకున్నట్లు మంత్రి వెల్లడించారు.

ఎపిలో 32,754 టన్నుల ముడి ఇనుము ఉత్పత్తి

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన ఐదేళ్లలో 32,754 టన్నుల ముడి ఇనుమును ఉత్పత్తి చేసినట్లు కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి ఫగ్గన్‌ సింగ్‌ కులస్తే వెల్లడించారు. రాజ్యసభలో విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా బదులిస్తూ ఎపిలో 2018-19లో 6,933 టన్నులు, 2019-20లో 6,539 టన్నులు, 2020-21లో 5,898 టన్నులు, 2021-22లో 7,096 టన్నులు, 2022-23లో 6,288 టన్నుల ముడి ఇనుము ఉత్పత్తి చేసినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా ఐదేళ్లలో మొత్తం 5,71,093 టన్నుల ముడి ఇనుము ఉత్పత్తి జరిగినట్లు పేర్కొన్నారు.

తాడేపల్లిగూడెంలో రూ.71.24 కోట్లతో అమృత్‌ పనులు

ఆంధ్రప్రదేశ్‌లోని తాడేపల్లిగూడెంలో కేంద్ర ప్రభుత్వ అమృత్‌ పథకం కింద రూ.71.24 కోట్లతో చేపట్టిన ప్రాజెక్టులు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం అందించిన సమాచారం మేరకు ఈ ఏడాది డిసెంబరు నాటికి పనులు పూర్తి కావచ్చని కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాలశాఖ మంత్రి కౌశల్‌ కిశోర్‌ వెల్లడించారు. రాజ్యసభలో విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ.. పట్టణంలో పార్కులు అభివృద్ధికి నాలుగు ప్రాజెక్టులు, నీటి సరఫరాకు 3 ప్రాజెక్టులు, సివేజ్‌, సెప్టేజ్‌ నిర్వహణకు 2 ప్రాజెక్టులు మంజూరు చేసినట్లు తెలిపారు. కేటాయించిన నాలుగు ప్రాజెక్టుల్లో మూడు పూర్తికాగా, మరో ప్రాజెక్టుకు సంబంధించి కాంట్రాక్టు ఖరారైనట్లు పేర్కొన్నారు. అలాగే నీటి సరఫరాకు సంబంధించిన మూడు ప్రాజెక్టుల్లో ఒక ప్రాజెక్టు పూర్తికాగా, మిగిలిన రెండు ప్రాజెక్టులకు కాంట్రాక్టు ఖరారు చేసినట్లు తెలిపారు.

➡️