న్యూఢిల్లీ: భారత రోడ్లపై నుంచి పెట్రోల్, డీజిల్ వాహనాలను తొలగిస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. పెట్రోలు, డీజిల్ వాహనాలను వదిలించుకోవడం కష్టమే కానీ అసాధ్యం కాదని ఆయన అన్నారు. పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కేంద్ర మంత్రి తన వైఖరిని స్పష్టం చేశారు. పెట్రోల్, డీజిల్ వాహనాలను పూర్తిగా నివారిస్తారా అన్న ప్రశ్నకు గడ్కరీ సమాధానం నూటికి నూరు శాతం. హరిత ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యం. దేశంలో 36 కోట్లకు పైగా పెట్రోల్ , డీజిల్ వాహనాలను వదిలించుకోవడం కష్టమే, కానీ అసాధ్యం కాదు.అని చెప్పారు. ఇంధన దిగుమతులపై భారతదేశం రూ.16 లక్షల కోట్లు ఖర్చు చేస్తోంది. ఈ డబ్బు రైతుల జీవితాలు బాగుచేయడానికి, గ్రామాల అభివద్ధికి, యువతకు ఉపాధి కల్పించడానికి ఉపయోగపడుతుంది. హైబ్రిడ్ వాహనాలపై జిఎస్టీని 5 శాతానికి, ఫ్లెక్స్ ఇంజిన్లపై జిఎస్టీని 12 శాతానికి తగ్గించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖకు ప్రతిపాదన పంపారు. తాను 2004 నుంచి ప్రత్యామ్నాయ ఇంధనాలపై పని చేస్తున్నానని, రానున్న ఐదు నుంచి ఏడేళ్లలో పరిస్థితులు మారతాయని నితిన్ గడ్కరీ చెప్పారు.