అంగన్‌వాడీల సమ్మె హామీలు అమలు చేయాలి

Feb 12,2024 08:11 #speech, #subbaravamma

– దేశ వ్యాప్త గ్రామీణ బంద్‌ జయప్రదం చేయండి

– ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ

ప్రజాశక్తి ా కడప అర్బన్‌ అంగన్‌వాడీల సమ్మె విరమణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ డిమాండ్‌ చేశారు. కడప సిఐటియు జిల్లా కార్యాలయంలో ఆదివారం అంగన్‌వాడీ సమావేశం నిర్వహించారు. సమ్మె కాలంలో జిఒ, పలు సమస్య పరిష్కారంలో కీలక పాత్ర పోషించి నిరాహార దీక్షకు కూర్చుని మొదటి సారి జిల్లాకు వచ్చిన సుబ్బరావమ్మకు అంగన్‌వాడీలు పూలబకేలు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్‌వాడీల సమ్మెకు సిఐటియు, అన్ని సంఘాల మద్దతు లభించిందని పేర్కొన్నారు. 42 రోజుల పాటు సమ్మె నిర్వహించి ప్రభుత్వ నిరంకుశ చర్యలను అడ్డుకున్నామని చెప్పారు. సిఎం జగన్‌మోహన్‌రెడ్డి మొండిగా వ్యవహరిస్తే అంగన్‌వాడీలు జగమొండిగా వ్యవహరించి కొన్ని హామీలను సాధించుకున్నారని తెలిపారు. ఎస్మా ప్రయోగించిన తరువాత అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించామని, చలో విజయవాడకు పిలునిచ్చామని తెలిపారు. అంగన్‌వాడీల సమ్మె ఒక చారిత్రాత్మకం అన్నారు. సమ్మె కాలంలో కొంతమంది ప్రాణాలు సైతం పోగొట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జులైలో ఎంత వేతనం పెంచుతారన్నది వేచి చూడాలన్నారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ నెల 16న నిర్వహించే గ్రామీణ బంద్‌లో అంగన్‌వాడీలు భాగస్వామలు కావాలని కోరారు. సెంటర్లను నడుపుతూ 2, 3 గంటలు పాల్గనాలని విజ్ఞప్తి చేశారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్‌, ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు లక్ష్మిదేవి, బి లక్ష్మిదేవి, అర్బన్‌ ప్రాజెక్టు కార్యదర్శి అంజనీదేవి, అంగన్‌వాడీలు, ఆయాలు పాల్గొన్నారు.

➡️