అక్రమాలపై పోరాడితే చంపేస్తామని బెదిరిస్తారా? : పవన్‌ కళ్యాణ్‌ ఫైర్‌

Dec 21,2023 15:45 #pawan kalyan, #press meet

అమరావతి: ఏపీ ప్రభుత్వం, వైసీపీ నాయకులపై జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ మండిపడ్డారు. విశాఖపట్నం కేంద్రంగా వైసీపీ ప్రభుత్వం, ఆ పార్టీ నాయకులు చేస్తున్న అక్రమాలు, చట్ట ఉల్లంఘనలపై న్యాయ పోరాటం చేస్తున్న తమ పార్టీ కార్పొరేటర్‌ పీతల మూర్తి యాదవ్‌ను చంపేస్తామని బెదిరించడం అధికార పక్షం వైఖరిని తెలియజేస్తుందని అన్నారు. ప్రశ్నించడం, చట్ట ఉల్లంఘనలపై పోరాడటం ప్రజాస్వామ్యంలో భాగమని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యం పట్ల గౌరవం లేని పాలకులు, వారి అనుయాయులు న్యాయ పోరాటాలను తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. అందుకే ప్రాణహానికి తలపెట్టారని ఆరోపించారు.విశాఖపట్నంలో రుషికొండను తొలిచేసి ప్యాలెస్‌ నిర్మించడంపై, దసపల్లా భూముల వ్యవహారం, టీడీఆర్‌ స్కామ్‌, టైకూన్‌ కూడలి మూసివేత, క్రైస్తవ ఆస్తులను కొల్లగొట్టి భారీ భవనాలు నిర్మించడం వంటి వైసీపీ చేస్తున్న అనేక అక్రమాలపై మూర్తి యాదవ్‌ పోరాడుతున్నారని పవన్‌ కళ్యాణ్‌ పేర్కొన్నారు. జీవీఎంసీలో చోటు చేసుకుంటున్న అవినీతి చర్యలు, తప్పుడు ర్యాటిఫికేషన్లపై కౌన్సిల్‌ సమావేశాల్లో బలంగా మాట్లాడుతున్నారని తెలిపారు. ఆయనకు జనసేన పార్టీ అండగా నిలుస్తుందని తెలిపారు. మూర్తి యాదవ్‌కు ప్రాణహాని తలపెట్టిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డీజీపీ, విశాఖపట్నం నగర పోలీస్‌ కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు. ఆయనకు ఏ చిన్నపాటి హాని కలిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.

➡️