– జూన్ ఒకటి నుంచి అమలు
ప్రజాశక్తి-హైదరాబాద్ బ్యూరో :తెలంగాణ ఆర్టిసి ఉద్యోగులకు యాజమాన్యం పిఆర్సిని ప్రకటించింది. వారికి 21 శాతం ఫిట్మెంట్ ఇవ్వనున్నట్లు తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. జూన్ ఒకటో తేదీ నుంచి కొత్త ఫిట్మెంట్ అమలులోకి రానుంది. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా 53,071 మంది ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది. శనివారం హైదరాబాద్లోని బస్ భవన్లో మంత్రి విలేకరులతో మాట్లాడారు. పిఆర్సి అమలుతో సంస్థపై నెలకు రూ.35 కోట్ల అదనపు భారం పడనుందని తెలిపారు. నష్టాల్లో ఉన్న సంస్థ ప్రస్తుతం గాడిలో పడుతోందని, బస్సుల్లో ఆక్యుపెన్సీ వంద శాతం దాటుతోందని చెప్పారు. కొత్త రూట్లలో బస్సులు నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఆర్టిసిని ప్రభుత్వంలో విలీనం అంశం పరిశీలనలో ఉందని, దీనిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.