ఎపిఇఆర్సి ఛైర్మన్ జస్టిస్ నాగార్జునరెడ్డి
ప్రజాశక్తి – తిరుపతి సిటీ :ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక్క రైల్వేపై తప్ప, మిగిలిన ఎవరిపైనా భారం వేయడం లేదని ఎపి ఎలక్ట్రసిటి రెగ్యులేటరీ కమిషన్ (ఎపిఇఆర్సి) చైర్మన్ జస్టిస్ నాగార్జునరెడ్డి తెలిపారు. డిస్కం ప్రతిపాదనలను పరిశీలించిన తర్వాత ఎవరిపై ఎలాంటి భారాలు వేయడం లేదని, ఒక్క రైల్వే విభాగానికి మాత్రం ఏడాదికి 100 కోట్ల రూపాయల భారాన్ని వేయనున్నట్లు తెలిపారు. తిరుపతి ఎస్పిడిసిఎల్ కార్పొరేట్ కార్యాలయంలో మంగళవారం స్టేట్ అడ్వైజరీ కమిటీ సమావేశం మంగళవారం జరిగింది. అనంతరం నాగార్జునరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రతిపాదనలను రాష్ట్రంలోని మూడు డిస్కంలు అందజేశాయని తెలిపారు. సమగ్రంగా పరిశీలించామని, జనవరి 27 నుంచి ఫిబ్రవరి మూడో తేదీ వరకూ బహిరంగ విచారణ నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా వినతులను స్వీకరించామని చెప్పారు. సమావేశంలో ఎపిఇఆర్సి సభ్యులు పివిఆర్ రెడ్డి, ఠాగూర్, తదితరులు పాల్గొన్నారు.