– రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్
– జగ్గయ్యపేటలో 150 అడుగుల జాతీయ పతాకం ఆవిష్కరణ
ప్రజాశక్తి-జగ్గయ్యపేట (ఎన్టిఆర్ జిల్లా):భారతదేశ జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య సేవలు చిరస్మరణీయమని, దేశ ప్రజల గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచి ఉంటారని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ అన్నారు. ఎన్టిఆర్ జిల్లా జగ్గయ్యపేటలోని తిరంగా పార్కులో ఏర్పాటు చేసిన 150 అడుగుల జాతీయ జెండాను గవర్నర్ శుక్రవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి పింగళి వెంకయ్య మనుమడు జివిఎన్ నరసింహం దంపతులు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో గవర్నర్ మాట్లాడుతూ.. చారిత్రక ఔన్నత్యం కలిగిన జగ్గయ్యపేటలో 150 అడుగుల జాతీయ జెండాను ఆవిష్కరించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఉమ్మడి కఅష్ణా జిల్లాకు చెందిన పింగళి వెంకయ్య జాతీయ పతాకాన్ని రూపొందించడం అందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. అనంతరం పింగళి వెంకయ్య మనుమడు జివిఎన్ నరసింహం దంపతులతోపాటు, జగ్గయ్యపేట అభివృద్ధిలో భాగస్వాములవుతున్న కెసిపి సిమెంట్స్, అల్ట్రాటెక్, రామ్కో, కొహాన్స్ లైఫ్ సైన్సెస్ తదితర సంస్థల ప్రతినిధులను సత్కరించారు. కార్యక్రమంలో గవర్నర్ సతీమణి సమీర నజీర్, ఎంపి కేశినేని శ్రీనివాస్ (నాని), ఎమ్మెల్సీ ఎం.అరుణ్కుమార్, రాష్ట్ర ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, కలెక్టర్ ఎస్.డిల్లీరావు, తదితరులు పాల్గొన్నారు.