రాబోయే ఎన్నికల్లో ఇండియా కూటమితో పని చేస్తాం : సిపిఐ నారాయణ

అమరావతి: రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏకి వ్యతిరేకంగా ఇండియా కూటమితో పని చేస్తామని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పష్టం చేశారు. దేశంలో రాజకీయ పార్టీలను భయపెట్టి పాలన సాగిస్తున్న బీజేపీకి ప్రజల చేతిలో ఓటమి ఖాయమన్నారు. ఈవీఎం టాంపరింగ్‌లను నమ్ముకున్న బీజేపీ 400 సీట్ల మాట మాట్లాడుతుందని, రాష్ట్రంలో జగన్‌, చంద్రబాబుతో సహా దేశంలో అనేక మంది సీఎంలు బిజెపికి మోడీకి లంగిపోయారన్నారు. వైసీపీ, టీడీపీలకు వ్యతిరేకంగా రాష్ట్రంలో పోటీ చేసేందుకు సిద్ధం అంటున్నారు.సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ.. ”బీజేపీ చెప్పేది పూజలు, చేసేవి బెదిరింపు రాజకీయాలు. దేశంలో ఉన్న ముఖ్యమంత్రులను బెదిరించి బీజేపీ తన దారికి తెచ్చుకుంటుంది. ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్న బీజేపీకి నాలుగు వందల సీట్లు ఎలా వస్తాయి?. వాళ్ళు ఈవీఎం టాంపరింగ్‌ను నమ్ముకున్నారేమో !. ఇండియా కూటమిని విచ్ఛిన్నం చేయాలని బీజేపీ ప్రయత్నం చేస్తుంది. అందుకే అరవింద్‌ కేజ్రీవాల్‌ లాంటి నాయకుడిని కూడా బీజేపీ తన గుప్పెట్లోకి బంధించింది. జాతీయ స్థాయిలో ఎన్డీఏకి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. ఇండియా కూటమితో పనిచేస్తాం.రాష్ట్రంలో మోడీ అడుగులకు, జగన్‌ ,చంద్రబాబు మడుగులు వత్తుతున్నారు. రాష్ట్రంలో వైసీపీ, టీడీపీలకు వ్యతిరేకంగా పోటీ చేస్తాం. కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం కూటమితో ఎన్నికల బరిలో దిగుతాం.” అని ఆయన వెల్లడించారు.

➡️