హైదరాబాద్: తెలంగాణలో వాహనదారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పెండింగ్ చలానాలపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. టూవీలర్స్పై 80 శాతం, ఫోర్ వీలర్స్, ఆటోలపై 60 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. లారీలతో పాటు ఇతర భారీ వాహనాలపై పెండింగ్ చలానాలో 50 శాతం తగ్గింపు ఇచ్చింది. ఈనెల 26వ తేదీ నుంచి జనవరి 10వ తేదీ వరకు డిస్కౌంట్ చలానాల చెల్లింపునకు అవకాశం కల్పించారు.2022 మార్చి 31 నాటికి రాష్ట్రంలో 2.4 కోట్ల చలానాలు పెండింగ్లో ఉన్నాయి. వీటిని తగ్గించుకోవాలన్న ఉద్దేశంతో గత ఏడాది ప్రత్యేక రాయితీ ప్రకటించారు. ద్విచక్ర వాహనాలకైతే 75 శాతం, మిగతా వాటికి 50 శాతం రాయితీ ఇచ్చారు. దీనికి అనూహ్య స్పందన వచ్చింది. కేవలం 45 రోజుల వ్యవధిలో రూ.300 కోట్ల వరకూ వసూలయ్యాయి. దాదాపు 65 శాతం చలానాలు చెల్లించారు. ఆ తర్వాత మళ్లీ పెండింగ్ భారం పెరిగిపోతోంది. గత నెలాఖరుకు చలానాల సంఖ్య మళ్లీ రెండు కోట్లకు చేరుకుందని అంచనా. ఈ నేపథ్యంలో మరోమారు రాయితీ ప్రకటించారు. నిర్ణీత వ్యవధిలో చలానాలు చెల్లించేవారికే ఈ రాయితీ వర్తిస్తుంది.
![](https://prajasakti.com/wp-content/uploads/2023/12/11-23.jpg)