- సునీత, ఆమె భర్త, సిబిఐ అధికారి రాంసింగ్పై కేసు
ప్రజాశక్తి-పులివెందుల టౌన్ : వైఎస్ వివేకానంద హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. వివేక కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్రెడ్డి, కేసు దర్యాప్తు చేపట్టిన సిబిఐ అధికారి రాంసింగ్పై పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు. వివేకా హత్యకేసులో కొందరు తనను బెదిరిస్తున్నారని ఆయన పిఎ కృష్ణారెడ్డి గతంలో పులివెందుల కోర్టును ఆశ్రయించారు. హత్య కేసుకు సంబంధం లేని వారి పేర్లు చెప్పాలంటూ తనపై బలవంతం చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించారని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించిన విచారణ శుక్రవారం పులివెందుల కోర్టు విచారించిందని, కేసును దర్యాప్తు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసి 2024 జనవరిలో సమర్పించాలని పులివెందుల అర్బన్ కోర్టు ఆదేశాలు జారీ చేసినట్లు వైసిపి లీగల్ అడ్వైజర్ లాయర్ ఓబుల్రెడ్డి సోమవారం మీడియాకు తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు 352, 323, 330, 342, 348, 506, 195ఎ, 166ఎ(బి), 109 ఐపిసి ఆర్/డబ్ల్యు 156(3) సిఆర్పిసి కింద సిబిఐ అధికారి రాంసింగ్, వివేక కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డిలపై కేసు నమోదు చేశారని చెప్పారు.