– సిపిఎం సహా పలు పార్టీల సంఘీభావం
ప్రజాశక్తి – కాకినాడ:ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అక్రమ అరెస్టును నిరసిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ఆదివారం కాకినాడలోని ధర్నా చౌక్ వద్ద ఉపవాస దీక్ష చేపట్టారు. ఈ దీక్షనుద్దేశించి ఆఫ్ జిల్లా కన్వీనర్ నరాల శివ మాట్లాడుతూ.. ఎలోక్టోరల్ బాండ్ల కుంభకోణంలో ప్రజల దృష్టిని మరలించేందుకే అరవింద్ కేజ్రీవాల్ను అరెస్టు చేశారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఘోరమైన ఓటమి తప్పదని గ్రహించిన బిజెపి ప్రభుత్వం ఇతర పార్టీల ముఖ్యమంత్రులను, నాయకులను ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఇడి, సిబిఐ, ఐటి సంస్థలను తన గుప్పిట్లో పెట్టుకుని అక్రమ కేసులు బనాయిస్తూ జైళ్ల పాలు చేస్తోందని విమర్శించారు. ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కాళ్లూరి కృష్ణమోహన్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా వ్యవహరించాలని కోరారు. బిజెపి మరోసారి అధికారంలోకి వచ్చేందుకు ఎంతటి నీచానికైనా దిగజారుతోందని విమర్శించారు. ప్రతి ఒక్కరు బిజెపి తీరును ఖండించాల్సిన అవసరముందన్నారు. సిపిఎం నాయకులు జుత్తుక శ్రీను, సిఐటియు నాయకులు రమణ, ఆర్బిఐ పార్టీ నాయకులు పిట్ట వరప్రసాద్ సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆప్ రాష్ట్ర మాజీ కన్వీనర్ వరప్రసాద్, పార్టీ నాయకులు రియాజ్ మహమ్మద్, వై.రాంబాబు, ఎన్ఎస్.రామారావు, మహాలక్ష్మీ, గ్రంథి నాగేశ్వరరావు, వంగపండు కృష్ణమూర్తి పాల్గొన్నారు.