-ఆట, పాటలతో అంగన్వాడీల నిరసన
-20వ రోజూ కొనసాగిన సమ్మె
ప్రజాశక్తి-యంత్రాంగం:అంగన్వాడీల సమ్మె 20వ రోజూ కొనసాగింది. ఆదివారం ఆట, పాటలతోపాటు వివిధ రూపాల్లో నిరసన తెలిపారు. ప్రభుత్వ వైఖరిని, తప్పుడు ప్రచారాలను నిరసించారు. తమ డిమాండ్లు పరిష్కరించే వరకూ ఎన్ని రోజులైనా సమ్మె కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. అనకాపల్లి జిల్లా మునగపాకలో సమ్మె శిబిరం వద్ద ‘ఆడుదాం-ఆంధ్ర’కు దీటుగా ‘పోరాడుదాం-ఆంధ్ర’ పేరుతో ముఖ్యమంత్రి ఫేస్ మాస్కులతో కోలాటం నిర్వహించారు. అనకాపల్లిలో ముఖ్యమంత్రి జగన్, మంత్రులు ఉషశ్రీ చరణ్, బత్స సత్యనారాయణ మాస్కులు ధరించి ‘ప్రభుత్వంతో ఆడుదాం అంగన్వాడీ’ కార్యక్రమం నిర్వహించారు. కబడ్డీ, టగ్ ఆఫ్ వార్ వంటి ఆటలు ఆడారు. బుచ్చయ్యపేటలో ఆటపాటలతో, అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరులో కోలాటం, థింసా నృత్యంతో నిరసన తెలిపారు. కర్నూలు జిల్లా మంత్రాలయం, ఆలూరులో కబడ్డీ ఆడారు. నంద్యాల జిల్లా మిడుతూరు, కొలిమిగుండ్లలో కబడ్డీ, బనగానపల్లెలో కుర్చీలాట, పాములపాడులో కబడ్డీ, ఖోఖో ఆడి, నంద్యాలలో సిఎం, మంత్రుల ఫొటోలు మెడలో వేసుకుని నిరసన తెలిపారు. తిరుపతిలో మంత్రుల ఫొటోలను మాస్క్గా ధరించి ‘ఆడుదాం మంత్రులతో కబడ్డీ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో కోలాటాలు, కార్వేటినగరంలో ఆటపాటతో నిరసన తెలిపారు. ఎన్టిఆర్ జిల్లా విజయవాడ ధర్నా చౌక్లోని అంగన్వాడీ సమ్మె శిబిరంలో అంగన్వాడీల కేంద్రాల పిల్లలతో ఆట-పాట కార్యక్రమాన్ని నిర్వహించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చిగురుపాటి బాబూరావు మద్దతు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం, ఆచంట, అత్తిలి, పెనుమంట్ర, పోడూరు, తాడేపల్లిగూడెం, గణపవరం, మొగల్తూరులో అంగన్వాడీలు సమ్మె శిబిరాల వద్ద ఆటలు ఆడి, పాటలు పాడారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ సమస్యలు పరిష్కరించే వరకూ సమ్మె విరమించేది లేదని స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా చింతలపూడి, మండవల్లి, పోలవరం మండలాల్లో 20 రోజుల సమ్మెలో భాగంగా 20 అక్షరం ఆకారంలో కూర్చొన్నారు. మ్యూజికల్ ఛైర్స్, ఆటపాటలతో, కలిదిండిలో సమ్మె శిబిరం వద్ద కేక్ కట్ చేసి, జంగారెడ్డిగూడెంలో రేలారేలా నృత్యంతో, ముసునూరులో ఒంటి కాలుపై నిల్చుని నిరసన తెలిపారు. డాక్టర్ బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉమ్మిడివరంలో 216 నెంబరు జాతీయ రహదారిపై క్రికెట్ ఆడారు. గుంటూరు జిల్లా కొల్లిపరలో ఖోఖో, ‘వీరివీరి గుమ్మడి పండు… వీరి పేరేమిటి’ లాంటి ఆటలు ఆడి నిరసన తెలిపారు. విజయనగరం జిల్లా గజపతినగరం, విజయనగరం, జామి, బాడంగి, ఎస్.కోట తదితర మండలాల్లో కబడ్డీ, ఖోఖో ఆడారు. పార్వతీపురం, పాలకొండ, సీతానగరం, బలిజిపేట, కురుపాం, గుమ్మలక్ష్మీపురం, సీతంపేట, కొమరాడ, గరుగుబిల్లి తదితర మండలాల్లో అంగన్వాడీ శిబిరాల్లో అంగన్వాడీలు ఆట పాటలతో నిరసన తెలిపారు. సాలూరులోని అంగన్వాడీ సమ్మె శిబిరం వద్దకు డిప్యూటీ సిఎం పి.రాజన్నదొర వచ్చి మాట్లాడారు. అంగన్వాడీల సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధి ఉందన్నారు. శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం, ఎచ్చెర్ల, కోటబమ్మాళిలో అంగన్వాడీలు ఆట, పాట కార్యక్రమం నిర్వహించి నిరసన తెలిపారు. అనంతపురం, శ్రీ సత్యసాయిల్లో పోస్టుకార్డు ఉద్యమం నిర్వహించారు. నెల్లూరు జిల్లా మైపాడులో దున్నపోతుకు వినతిపత్రం అందజేసి నిరసన తెలిపారు. 5వ తేదీలోపు విధుల్లో చేరకుంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు : మంత్రి బత్స బెదిరింపులుఅంగన్వాడీలు జనవరి 5వ తేదీలోపు విధుల్లో చేరకుంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బత్స సత్యనారాయణ హెచ్చరించారు. విజయనగరం జిల్లా బబ్బిలి మండలం పక్కి గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా జరిగిన సభలో ఆయన పాల్గన్నారు. అంగన్వాడీల సమ్మె గురించి విలేకరులు ప్రశ్నించగా, ఆయన పైవిధంగా స్పందించారు. గత ప్రభుత్వం కొంత పెంచగా, తాము మరికొంత పెంచామని చెప్పారు. ఐదో తేదీకి బాలామృతం, వివిధ కిట్లు పంపిణీ చేయాల్సి ఉన్నందున అంగన్వాడీలు సానుకూలంగా ఆలోచించి విధుల్లో చేరాలని కోరారు.
ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఆటలు ఆడుతూ అంగన్వాడీల నిరసన
డా.బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా – రామచంద్రపురం : ఉరితాళ్లు వేసుకుని వినూత్న రీతిలో నిరసన
అల్లూరి-రాజవొమ్మంగి : తమ సమస్యలు పరిష్కరించాలంటూ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు అనుబంధం ఆధ్వర్యంలో ఆదివారం రాజవొమ్మంగిలో స్థానిక అల్లూరి జంక్షన్ వద్ద రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. మానవహారం చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తొలిత అంగన్వాడీలు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఆదివారం అంగన్వాడీల సమ్మె 20వ రోజు కొనసాగించారు. కార్మిక సంఘ గీతాలకు అంగన్వాడీలు రహదారిపై లయబద్ధంగా కోలాటం, దింశా నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా వాహనాలు చాలా సేపు నిలిచిపోయాయి, అంగన్వాడీలు చేస్తున్న ఉద్యమానికి నిరీక్షించిన గ్రామస్తులు విసుకు చెందకుండా వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా అంగన్వాడి ప్రాజెక్టు నాయకులు కె వెంకటలక్ష్మి, సిహెచ్ కుమారి,సిఐటియు జిల్లా నాయకులు పి రామరాజు,సీపీఎం నాయకులు జర్తా రాజు లు మాట్లాడుతూ, 2019 ఎన్నికల సమయంలో పాదయాత్రలో ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీలు నెరవేర్చమని, తెలంగాణలో కన్నా అదనంగా వెయ్యి రూపాయల ఇస్తామని చేసిన హామీలు నెరవేర్చమంటే సమ్మెలో ఉండగా దౌర్జన్యంగా అంగనవాడిలపై దాడులు చేయడం సమంజసం కాదన్నారు,అక్రమ అరెస్టులను, దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. అంగన్వాడీలపై దాడులును పిరికి బంధ చర్యగా అభివర్ణించారు, కనీస వేతనం అమలు చేయాలని,తెలంగాణ కంటే అదనంగా వెయ్యి రూపాయలు ఇచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మాట తప్పకుండా నిలబెట్టుకోవాలన్నారు. పలువురు అంగన్వాడి నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే సమ్మెను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ నాయకులు ఎల్ సత్యవతి, నూకరత్నం, కె లక్ష్మి, చిన్నమ్మలు, రమణి, రమణ, రత్నం, రాజేశ్వరి, మంగ, రాధ, ఎర్రయ్యమ్మ పెద్ద సంఖ్యలో అంగన్వాడీలు పాల్గొన్నారు.
- అంగన్వాడీలకు అమరావతి జెఎసి మద్దతు
అమరావతి : అంగన్వాడి కార్యకర్తలు, సహాయకులు చేస్తున్న సమ్మెకు అమరావతి జేఏసీ నాయకులు పువ్వాడ సుధాకరరావు, అమరావతి బహుజన ఐకాస కన్వీనర్ పోతుల బాలకోటయ్య ఆదివారం మద్దతు తెలిపారు. స్థానిక బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద సమ్మె చేస్తున్న అంగన్వాడి కార్యకర్తలు, సహాయకుల వద్దకు వచ్చి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా సుధాకరరావు,పోతుల బాల కోటయ్య మాట్లాడుతూ, అమరావతి ఉద్యమానికి అండగా ఉన్న అంగన్వాడీలకు అమరావతి జెఎసి, బహుజన ఐకాసా మద్దతుగా ఉంటాయని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమరావతి ఉద్యమంపై వ్యవహరిస్తున్న నిర్లక్ష్య వైఖరినే అంగన్వాడీల సమ్మె పట్ల ప్రదర్శిస్తోందని
అన్నారు. 1475 రోజులుగా రాజధాని రైతులు,మహిళలు ఉద్యమం చేస్తుంటే జగన్ మోహన్ రెడ్డి ఒక్కసారి కూడా చర్చించలేదని అన్నారు. ప్రభుత్వం మొండి వైఖరి కారణంగానే అంగన్వాడీలు గత్యంతరం లేక ఉద్యమ బాట పట్టాల్సి వచ్చిందన్నారు. 20 రోజులుగా సమ్మె జరుగుతుంటే చర్చించి పరిష్కరించాలనే ఇంగితం ప్రభుత్వానికి లేదా..అని నిలదీశారు. అంగన్వాడీలతో కలిసి ప్రత్యక్ష పోరాటానికైనా తాము సిద్ధమని చెప్పారు. కార్యక్రమంలో సిఐటియు రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం భాగ్యరాజు, ఏపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ మండల అధ్యక్ష, కార్యదర్శి స్వర్ణ లత, కరిమూన్, అన్నామణి,రజనీ,రైతు కంచర్ల గాంధీ పాల్గొన్నారు.
- ఐక్యంగా.. సంఖ్యగా… అంగన్వాడీల సమ్మె
అన్నమయ్య జిల్లా – రైల్వేకోడూరు : అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మె ఆదివారానికి 20వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా అంగన్వాడీలో 20వ అంకె ఆకారంలో మానవహారం ఏర్పాటు చేసి నిరసన తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు, సిహెచ్ చంద్రశేఖర్. ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు పి .జాన ప్రసాద్, అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్ యూనియన్, సిఐటియు అనుబంధం, ప్రాజెక్టు, గౌరవ అధ్యక్షులు, వనజ కుమారి , అధ్యక్షురాలు, రమాదేవి, వర్కింగ్ ప్రెసిడెంట్, రాధా కుమారి, మండల కార్యదర్శి జి. పద్మావతి, వెన్నెల,దుర్గ, శిరీష, లీలావతి, జయకుమారి, సుజాత, మునీంద్ర, ఈశ్వరమ్మ, కుమారి, నాగరాణి, వాణి, స్వర్ణలత, గీత, సురేఖ, కళ, రెడ్డమ్మ, రోజా, చెంచులక్ష్మి, బేబీ, సునీత, ఏఐటీయూసీ నాయకులు సరోజ నిర్మల నాగమణి తదితరులు పాల్గొన్నారు.
- 20వ రోజుకు చేరిన అంగన్వాడీల సమ్మె
కర్నూల్ జిల్లా -కోడుమూరు : అంగన్వాడి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలు చేస్తున్నసమ్మె 20వ రోజుకు చేరిన సందర్భంగా అంగన్వాడీలు అమ్మవారికి పూనకం వచ్చిన రీతిలో నిరసన తెలియజేశారు ఒక కార్యకర్త అమ్మవారి రూపంలో తన జట్టు విరబూచుకొని తోటి కార్యకర్తలు తమ సమస్యలు పరిష్కరించాలని వేపాకు చేత పట్టుకుని జగన్మోహన్ రెడ్డికి మంచి బుద్ధి ఆ అమ్మవారు ప్రసాదించాలని అమ్మవారి రూపంలో ఉన్నటువంటి కార్యకర్తను అడిగారు నాయకులు .గఫూర్మియా వీరన్న .మాట్లాడుతూ 2023 సంవత్సరం ఈరోజుతో ముగిసిపోతుంది ఉదయం తెల్లారేసరికి తెల్లవారుజామున 12 గంటలకి 2024 వ నూతన సంవత్సరం రాబోతున్నది 23 సంవత్సరం ఎలా ముగిసిందో అంగన్వాడీల సమస్యల పరిష్కరించకపోతే 24 వ సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా అలాగే ముగిసిపోతుందని అంగన్వాడీ నాయకురాలు విజయభారతి .సూలమ్మ విమర్శించారు గత 20 రోజుల నుండి అంగన్వాడీలు తమ జీతాలు పెంచమని పిల్లాపాపలను వదిలిపెట్టి రోడ్లమీద ఆందోళన చేస్తుంటే కనీసం ఈ ప్రభుత్వం మహిళలని కూడా చూడకుండా దుర్మార్గంగా మహిళలపై వివక్షత చూపిస్తూ కాలం గడుపుతున్నది జగన్మోహన్ రెడ్డికి ఒకపక్క ప్రభుత్వం పడిపోతుంది అనే భయం ఉన్నా మేకపోతు గంభీరంలాగా అంగన్వాడీల సమస్యలు పరిష్కరించడానికి అహంకారంతో ఉన్నాడు సంబంధిత మంత్రి మహిళ అయ్యిండి కూడా యూనియన్ నాయకులను తీసుకొని ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని సమస్యలను పరిష్కరించడంలో చాలా విఫలమైపోయారు ఎందుకంటే ఆమె సీటు ఉంటుందో లేదో అని భయాందోళనలో ఉన్నది ప్రజా ప్రతినిదులందరు వారి సీట్ల పైన వారికి నమ్మకం లేదు. ఇక రాష్ట్ర ప్రజల గురించి .కార్మికుల గురించి .రైతుల గురించి పేదల గురించి పట్టించుకునే పరిస్థితిలో ఎక్కడ ఉన్నారు ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అంగన్వాడీలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చి వెంటనే జీతాలు పెంచాలని వారి డిమాండ్ చేశారు అవసరమైతే ఒకటవ తేదీ నుండి ప్రత్యక్ష కార్యాచరణ రూపంలో ఆందోళన చాలా ఉధృతంగా ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం సూపర్వైజర్లను ఉసిగొలిపి పేద అంగన్వాడి కార్యకర్తలను జీతాలు ఇప్పిస్తాము డ్యూటీలకు రండి అని మభ్యపెడుతున్నారు యూనియన్ గా మేము హెచ్చరిస్తున్నాం సూపర్వైజర్లు గాని మరి ఇతర ఏ అధికారులైనా సరే అంగన్వాడి హెల్పర్లను కానీ టీచర్లను గాని భయభ్రాంతుల గురిచేసి ఇబ్బంది పెడితే అధికారులు అని కూడా చూడకుండా కార్యక్రమం లో ఉంటాం ఇదే మా హెచ్చరిక దయచేసి అధికారులు చేసే ప్రయత్నం ప్రభుత్వం తో చేసి మా సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తే సంతోషంగా విధుల్లోకి హాజరు కావడానికి అంగన్వాడీలకు ఎలాంటి అభ్యంతరం లేదు ఈ కార్యక్రమంలో అంగన్వాడి నాయకురాలు .అరుణ భాగ్యమ్మ .రజియా ఫాతిమా .హైమావతి మండలంలోని అంగన్వాడి కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మల్లో అంగన్వాడీ కార్యకర్తలు నిరసన శిబిరం వద్ద కోలాటం డాన్స్ తో నిరసన వ్యక్తం చేశారు.
- కొనసాగుతున్న అంగన్వాడి నిరవధిక దీక్ష.
కాకినాడ -రౌతులపూడి : తమ డిమాండ్లు పరిష్కరించాలని గత కొన్ని రోజులుగా అంగన్వాడీ టీచర్లు. సహాయకులు చేపడుతున్న నిరవధిక నిరాహార దీక్ష మండల కేంద్ర మైన రౌతులపూడి తాసిల్దార్ కార్యాలయం ముందు ఆదివారం కొనసాగింది. డిమాండ్లు పరిష్కరించాలని రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు, సహాయకులు నిరాహార దీక్షలు చేపడుతున్న ప్రభుత్వం స్పందించకపోవడంపై అంగన్వాడి టీచర్లు సహాయకులు మండిపడుతున్నారు . ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకపోతే ఉద్యమం తీవ్రతం చేస్తామని అంగన్వాడి యూనియన్ నాయకులు రాజేశ్వరి. రత్నకుమారి తెలిపారు.
- అంగన్వాడీల సమ్మెకు మాజీ ఎమ్మెల్సీ అంగర సంఘీభావం
పశ్చిమ గోదావరి జిల్లా – పాలకొల్లు : పనికి తగ్గ వేతనం ఇవ్వాలని అంగన్వాడీలు చేస్తున్న సమ్మె ఆదివారం 20వ రోజుకు చేరింది. అంగన్వాడీలం ఆట పాటలతో ప్రభుత్వంకు వ్యతిరేకంగా పాటలు పాడారు. ఈ సందర్భంగా తహశీల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడీ శిబిరం వద్దకు మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ వచ్చి సంఘీభావం తెలిపారు. అమ్మ తరువాత అమ్మ వలె లాలిస్తున్న అంగన్వాడీలకు పనికి తగ్గ వేతనం ఇవ్వాలని డిమాండ్ న్యాయం అని అన్నారు. ఇంకా సిఐటియు మండల కార్యదర్శి జవ్వాది శ్రీనివాస్ పాల్గొన్నారు.
కోనసీమ జిల్లా ముమ్మిడివరం జాతీయ రహదారి 216 పై క్రికెట్ ఆడి సమస్యలు పరిష్కరించాలంటూ నిరసన వ్యక్తం చేసిన ప్రాజెక్ట్ పరిధిలోని అంగన్ వాడీలు, వీరికి మద్దతు తెలిపిన సిఐటియు జిల్లా కార్యదర్శి జి దుర్గా ప్రసాద్
- ఉరితాళ్లు వేసుకుని వినూత్న రీతిలో నిరసన
20వ రోజుకు అంగన్వాడీల సమ్మె
డా.బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా – రామచంద్రపురం : తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలంటూ అంగన్వాడి వర్కర్లు చేస్తున్న నిరవదిక సమ్మె ఆదివారం 20వ రోజుకు చేరుకుంది. తమ సమస్యలు పరిష్కరించాలంటూ నిరసన వ్యక్తం చేసిన అంగన్వాడీ వర్కర్లు ఉరి తాళ్లు బిగించుకుని వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. సుమారు 20 మంది ఉరితాడు బిగించుకుని ఉదయం నుండి సాయంత్రం వరకు వాటికి వేల పడుతున్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూకల బలరాం మాట్లాడుతూ ప్రభుత్వం ఇ ప్పటికైనా అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని 20 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం స్పందించకపోవడం దారుణం అన్నారు. అటు గ్రామాల్లోనూ అంగన్వాడి సెంటర్లో తేరుచు కోక పోవడం తో చిన్నారులు, బాలింతలు గర్భిణీ స్త్రీలు పౌష్టికాహారం కోసం ఎదురుచూస్తున్నారని, వెంటనే సమస్యలు పరిష్కరించి అంగన్వాడి వర్కర్లను విధుల్లోకి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అంగన్వాడి యూనియన్ నాయకులు దుర్గ మాట్లాడుతూ ప్రభుత్వం సమ్మె పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తుందని సీఎం జగన్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని వెంటనే జీతాలు పెంచి సమ్మెను విరమింప చేయాలని కోరారు. కార్యక్రమంలో రామచంద్రపురం పట్టణం కే గంగవరం రామచంద్రపురం రూరల్ మండలం నుండి సుమారు నాలుగు వందల మంది అంగన్వాడి వర్కర్లు ఆయాలు సన్నలో పాల్గొన్నారు.
20వ రోజుకు చేరిన అంగన్వాడీల నిరవధిక సమ్మె
తూర్పు గోదావరి జిల్లా -గోకవరం : మండల కేంద్రమైన గోకవరం తాసిల్దార్ కార్యాలయం సమీపంలో అంగన్వాడీల అపరిస్కృత సమస్యలపై నిర్వహిస్తున్న నిరవధిక సమ్మెఆ దివారానికి 20వ రోజులకు చేరింది. ఈ సమ్మెలో సుమారు 150 మంది అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంగన్వాడి యూనియన్ నాయకులు మాట్లాడుతూ గత 20 రోజులుగా అంగనవాడి సమస్యలపై సమ్మె చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వంలో ఎటువంటి స్పందనలేదని ఆర్థికపరమైన జీతాల సమస్యను, గ్రాడ్యుటి సమస్యను తీర్చకుండా తూతూ మంత్రంగా చర్చలు జరిపి, నిరంకుశ ధోరణిగా వ్యవహరిస్తుందని తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీని, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం మేము అడుగుతున్నాం తప్ప ఆదనంగా మాకు ఏమీ ఇవ్వమని అడగడం లేదని తెలిపారు. పాదయాత్ర చేసేటప్పుడు అంగన్వాడి అక్క చెల్లెమ్మలు గుర్తున్నారని, అధికారం వచ్చిన తర్వాత అక్క చెల్లెమ్మలు గుర్తుకు రావడం లేదని ఆరోపించారు. సీఎం జగన్ మాకు ఇస్తానన్న హామీలు ఇచ్చే వరకు ఈ సమ్మె ఆపేది లేదని తెలిపారు. ఈ సమ్మెను రాష్ట్రవ్యాప్తంగా మరింత ఉద్రిక్తత చేస్తామన్నారు. ఒక్క వైసీపీ ప్రభుత్వం తప్ప అన్నిరాజకీయ పార్టీలు, అన్ని కార్మిక సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు మాకు మద్దతుగా నిలిచాయని వారు తెలిపారు. రాబోయే కాలంలో అంగన్వాడీల సత్తా ఏంటో చూపిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో అంగన్వాడీలు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లాలో ముదిగుబ్బ స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు నృత్యాలు, నిరసన తెలిపారు. ప్రజాశక్తి పేపర్ చదువుతూ…
అంగన్వాడీల రాష్ట్ర వ్యాప్తంగా భాగంగా 19వ రోజు ఆదివారం ఏలూరు కలెక్టరేట్ వద్ద రోడ్డుపై పొర్లు దండాలు పెట్టి తమ నిరసన తెలియజేసిన అంగన్వాడీలు.
ఏలూరు : చింతలపూడి పట్టణంలో ఫైర్ స్టేషన్ వద్ద అంగన్ వాడీల సమ్మేలో 20వ రోజు భాగంగా వినుత్న నిరసన తెలుపున్న వైనం,
20వ రోజు కారంచేడు మండల కార్యాలయం వద్ద సమ్మెలో భాగంగా ఆదివారం రోజు ఆందోళన చేస్తున్న కారంచేడు మండల అంగన్వాడీ కార్యకర్తలు
- కబడ్డీ ఆడీ నిరసన
20వ రోజుకి చేరిన సమ్మె
విజయనగరం టౌన్ : అంగన్వాడీలు చేపట్టిన సమ్మె ఆదివారం నాటికి 20వ రోజుకి చేరుకుంది. సమ్మెలో భాగంగా జిల్లా కలెక్టరేట్ ఎదుట చేపట్టిన నిరవధిక దీక్ష శిబిరం వద్ద కబడ్డీ ఆడి నిరసన వ్యక్తం చేశారు. కబడ్డీ లో వేతనాలు పెంచాలని, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ అమలు చెయ్యాలని కూత పెట్టారు. ఈ సందర్భంగా అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బి పైడిరాజు మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్వాడీలు సహనాన్ని పరీక్షిస్తుందని, మహిళలు ఆగ్రహానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గురి కావోద్దని హెచ్చరించారు. మా న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతుంటే సమస్యలు పరిష్కారం చేయకపోగా బెదిరింపులకు పాల్పడటం సరైంది కాదన్నారు. మేము తాటాకు చప్పలకు భయపడేది లేదని, మా సమస్యలు పరిష్కారం చేసి మా వేతనాలు పెంచే వరకు ఉద్యమం కొనసాగుతుందన్నారు. ప్రభుత్వం దిగిరాకుంటే దిగి వచ్చే వరకు ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సుశీల, రాధ, ఉష, కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు.
కడప-జమ్మలమడుగు పట్టణంలోని ఐసిడిఎస్ కార్యాలయం ఎదురుగా ఏపీ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మహిళలు ఆటపాటలతో నిరసన వ్యక్తం చేస్తున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో అంగన్వాడీల ఆటపాటలు
చిత్తూరు గాంధీ విగ్రహం ఎదుట అంగన్వాడీల ధర్నా