ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అగ్రవర్ణాలతో పోటీ పడాలన్న లక్ష్యంతో బిసిల కోసం సిఎం జగన్ ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. దేశంలో బిసిలు ముఖ్యమంత్రిగా వున్న రాష్ట్రాల్లో కూడా అమలు చేయనన్ని కార్యక్రమాలు, పథకాలను రాష్ట్రంలో అమలు చేశారని అన్నారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో రజక కార్పొరేషన్ ఛైర్మన్ మీసాల రంగయ్య అధ్యక్షతన రజకుల రాష్ట్రస్థాయి ఆత్మీయ సమావేశం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. అమలవుతున్న పథకాలను బట్టి నాలుగున్నరేళ్ల కాలంలో 18 లక్షల రజక కుటుంబాలకు మేలు జరిగిందన్నారు. రజకులకు డిబిటి ద్వారా బ్యాంకు ఖాతాల్లో రూ.5,600 కోట్లు, నాన్ డిబిటి ద్వారా రూ.17 వేల కోట్లను రజక కుటుంబాలకు ఇచ్చామన్నారు. ఏ ప్రభుత్వం ఇవ్వనన్ని నామినేటెడ్ పదవులను బిసిలకు ఇచ్చామన్నారు. గతంలో రజకులకు చంద్రబాబు కేవలం ఐరన్ బాక్సులు ఇచ్చి మభ్యపెట్టారని విమర్శించారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/01/sajjala-ramkrishnareddy-copy.jpg)