ఒంగోలు : మర్రిచెట్టు తొర్రలో దాచిన రూ.66 లక్షల నగదును పోలీసులు సీజ్ చేశారు.
ఒంగోలు పట్టణంలో ఒంగోలులోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎం దగ్గర గత గురువారం ఏటీఎంలో నగదు నింపే వ్యాన్లోంచి రూ.66 లక్షల నగదును దుండగులు దొంగిలించారు. కర్నూలు రోడ్డులోని వర్మ హౌటల్ దగ్గర వ్యాన్ను ఆపి భోజనం చేసేందుకు వెళ్లారు. తిరిగి వచ్చేసరికి రూ.66 లక్షల చోరీ జరిగినట్లు గుర్తించారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. టెక్నికల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి, పోలీసులు నిందితుడు మహేష్ బాబును పేర్నమిట్ట నుండి పట్టుకొని అరెస్టు చేశారు. అతడిని విచారించగా… వారంతా దొంగిలించిన డబ్బును మర్రి చెట్టు కుహరంలో దాచామని చెప్పాడు. మహేష్ బాబు సహ నిందితులైన రాజశేఖర్, కొండారెడ్డిని కూడా పోలీసులు లింగారెడ్డి కాలనీలోని సీఎంఎస్ కార్యాలయం వద్ద అరెస్టు చేశారు. వారు దొంగిలించిన డబ్బు మొత్తం మర్రిచెట్టు తొర్రలో పడి ఉండటాన్ని గుర్తించిన పోలీసులు అవాక్కయ్యారు. నిందితులను సీఎంఎస్ మాజీ ఉద్యోగి సన్నమూరు మహేష్బాబు (22), రాచర్ల రాజశేఖర్ (19), ఒంగోలు సీఎంఎస్ బ్రాంచ్ మేనేజర్ గుజ్జుల వెంకట కొండారెడ్డి (40)గా గుర్తించారు. వివిధ ఏటీఎంలలో నగదు నింపేందుకు సీఎంఎస్ సెక్యూరిటీ కంపెనీ సిబ్బంది తమ శాఖ నుంచి రూ.68 లక్షలు తీసుకున్నారని ప్రకాశం ఎస్పీ గరుడ్ సుమిత్ అనీల్ తెలిపారు.