సీసీఎస్‌ ఏసీపీ ఉమామహేశ్వరరావుకు 14 రోజుల రిమాండ్‌

హైదరాబాద్‌: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హైదరాబాద్‌ సీసీఎస్‌ ఏసీపీ టి.ఎస్‌.ఉమామహేశ్వరరావును అరెస్టు చేసిన అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు బుధవారం కోర్టులో హాజరుపర్చారు. ఏసీబీ కోర్టు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్‌ విధించడంతో ఉమామహేశ్వరరావును చంచల్‌గూడ జైలుకు తరలించారు.
మంగళవారం తెల్లవారుజామునే హైదరాబాద్‌ అశోక్‌నగర్‌లోని ఏసీపీ ఇంటికి చేరుకున్న ఏసీబీ అధికారులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని 14 చోట్ల ఏకకాలంలో మరిన్ని బఅందాలు సోదాలు జరిపాయి. ఉమామహేశ్వరరావు సోదరుడితోపాటు బంధువులు, సన్నిహితుల ఇళ్లలోనూ ఇవి కొనసాగాయి. సోదాల్లో భారీగా రూ.500 నోట్ల కట్టలను, ఆభరణాలను, 17 ప్రాంతాల్లో ఉన్న స్థిరాస్తుల పత్రాలను గుర్తించారు. ఇప్పటివరకు విశ్లేషించిన సమాచారం మేరకు ఆదాయానికి మించిన ఆస్తుల విలువ రూ.3.46 కోట్ల వరకు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. బహిరంగ మార్కెట్‌లో వీటి విలువ రెట్టింపు ఉంటుందని భావిస్తున్నారు.

➡️