ప్రజాశక్తి-అమరావతి : ఇప్పుడిప్పుడే మాచర్లలో పరిస్థితి అదుపులోకి వస్తోందని.. ఈ సమయంలో టిడిపి నేతలు మాచర్లకు వెళ్లడం మంచిది కాదని సీఈవో ముఖేశ్ కుమార్ మీనా తెలిపారు. టిడిపి నేతలు మాచర్లకు వెళ్లే మళ్లీ పరిస్థితి అదుపుతప్పే అవకాశం ఉందన్నారు.
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం కేసులో పిన్నెల్లి అరెస్ట్ కు చర్యలు తీసుకున్నామని, అతడిని అరెస్ట్ చేసేందుకు అదనపు ఎస్పీ, డీఎస్పీలతో 8 పోలీస్ బృందాలు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. ఈవీఎం ధ్వంసం చేసిన దశ్యాలతో కూడిన వీడియో ఈసీ నుంచి బయటికి వెళ్లలేదని… దర్యాప్తు సమయంలో ఎక్కడో, ఎవరి చేతి నుంచో ఆ విజువల్స్ బయటికి వచ్చాయని ముఖేశ్ కుమార్ మీనా స్పష్టం చేశారు. ఈవీఎం ధ్వంసం ఘటనలో పీవో, ఏపీవోల సస్పెన్షన్ కు ఇప్పటికే ఆదేశాలిచ్చామని తెలిపారు. జూన్ 4న కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో.. ఈ నెల 25 నుంచి స్ట్రాంగ్ రూంల పరిశీలనకు రాష్ట్రంలో పర్యటిస్తానని వెల్లడించారు.