చంద్రబాబు తన రెండు కళ్ల సిద్ధాంతాన్ని కొనసాగిస్తున్నాడు: కొడాలి నాని

Dec 24,2023 14:39 #kodali nani, #press meet

గుడివాడ: టీడీపీ అధినేత చంద్రబాబు, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ భేటీపై మాజీ మంత్రి కొడాలి నాని సెటైర్లు వేశారు.. కృష్ణా జిల్లా గుడివాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు ఎంతమంది పీకేలను పెట్టుకున్నా.. సీఎం వైఎస్‌ జగన్‌ను పీకేదేం ఉండదన్నారు. చంద్రబాబు అవుట్‌డేటెడ్‌ పొలిటీషియన్‌ అని సీఎం జగన్‌, మేం రోజు చెబుతూనే ఉన్నాం.. ఇప్పుడు ప్రశాంతి కిషోర్‌ ను కలిస్తే భూమి బద్దలై పోతుందా..? అని ప్రశ్నించారు. ప్రశాంత్‌ కిషోర్‌ ను మేం పూర్తిగా వాడేశాం.. ఆయన బుర్రలో గుజ్జంతా అయిపోయిందని వ్యాఖ్యానించారు. మా వ్యూహకర్తగా ఉన్నప్పుడు బీహార్‌ నుండి వచ్చిన ప్రశాంత్‌ ఏం పికుతాడు తమ్ముళ్లు అన్న చంద్రబాబు.. ఇప్పుడు ఏం పికడానికి భేటీ అయ్యాడో పసుపు తమ్ముళ్లకు చెప్పాలని డిమాండ్‌ చేశారు.ప్రశాంత్‌ కిషోర్‌ సూచనలతో బాబాయ్ ని చంపి, జగన్‌ కోడి కత్తి డ్రామాలు అడారని గగ్గోలు పెట్టారు.. మరి ఇప్పుడు చంద్రబాబు పీక కోయించుకోవడానికి.. లోకేష్‌ తండ్రిని చంపడానికి ప్లాన్‌ వేస్తున్నారా? అంటూ ఎద్దేవా చేశారు కొడాలి నాని.. ఇక, ప్రశాంతి కిషోర్‌ కు, ఐప్యాక్‌ కు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇండియా ఫోరంలో చేరమని సీఎం మమతా బెనర్జీ పంపితే ప్రశాంత్‌ కిషోర్‌ ఏపీకి వచ్చారని చెప్పుకొచ్చారు.. పాట్నర్‌ పీకే (పవన్‌ కల్యాణ్‌) బీజేపీతో చర్చలు జరుపుతుంటే.. మరో పీకే (ప్రశాంత్‌ కిషోర్‌) ఇండియ ఫోరం, మమతా బెనర్జీ, కాంగ్రెస్‌ తో చర్చలు జరుపుతున్నాడు అని దుయ్యబట్టారు. మరోసారి చంద్రబాబు తన రెండు కళ్ల సిద్ధాంతాన్ని కొనసాగిస్తున్నాడని మండిపడ్డారు.

➡️