పులివెందుల (కడప) : క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని … పులివెందులలోని సిఎస్ఐ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో సిఎం జగన్ కుటుంబసమేతంగా పాల్గొన్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా … సిఎం కడప జిల్లాకు వచ్చారు. శుక్రవారం, శనివారం, ఆదివారం మూడు రోజుల పాటు ఆయన జిల్లాలోనే పర్యటించారు.
ఆదివారం ఉదయం ఇడుపులపాయ నుంచి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి పులివెందులలోని భాకరాపురంలోని హెలిప్యాడ్కు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డుమార్గాన సిఎస్ఐ చర్చికి ఉదయం 9 గంటల సమయానికి వచ్చారు. సిఎం జగన్ తల్లి విజయలక్ష్మి, ఆయన భార్య భారతి, కడప ఎంపి వైఎస్ అవినాశ్ రెడ్డి, వైఎస్ ప్రకాశ్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ మనోహర్ రెడ్డి, తదితర కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం సిఎం జగన్ పెదనాన్న వైఎస్ ప్రకాశ్ రెడ్డి, విజయలక్ష్మి కలిసి క్రిస్మస్ కేక్ను కట్ చేశారు. అనంతరం రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన సంవత్సర క్యాలెండర్లను ఆవిష్కరించారు. సిఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలను ముగించుకుని 10:30 గంటల సమయంలో భాకరాపురంలోని హెలిప్యాడ్కు ముఖ్యమంత్రి బయలుదేరి వెళ్లారు. ఉదయం 10:50 గంటల సమయంలో హెలికాప్టర్ ద్వారా ఆయన కడప విమానాశ్రయానికి వెళ్లి అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరానికి బయలుదేరి వెళ్లారు. అక్కడి నుండి తాడేపల్లికి చేరుకుంటారు.