అమరావతి: ఆంధ్రప్రదేశ్ సీఎస్గా బాధ్యతలు స్వీకరించిన సీనియర్ ఐఏఎస్ అధికారి నీరభ్ కుమార్ ప్రసాద్.. ఇక, వెంటనే తన పనిపై ఫోకస్ పెట్టారు.. శనివారం సచివాలయంలో ఆర్థిక శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన ఆర్థిక శాఖ ఉన్నతాధికారి సత్యనారాయణ సహా ఇతర అధికారులు హాజరయ్యారు. ఏపీ ఆర్థిక స్థితి గతులపై కీలకంగా చర్చ సాగింది.. అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వెంటనే నివేదిక సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ మాట్లాడుతూ.. సీఎస్ గా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు.. సహచర అధికారులు సిబ్బందితో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు తన వంతు కృషి చేస్తానని వెల్లడించారు.. ప్రభుత్వ ప్రాధాన్యాలకు అనుగుణంగా తన పని ఉంటుంది.. మంచి చేసేలా కృషి చేస్తాను అన్నారు.. అభివృద్ధి, సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో మరింత సమర్థవంతంగా అమలుకు కృషి చేస్తాను అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందంజలో నిలిపేందుకు శాయశక్తులా కృషి చేస్తాను అన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/06/neerabh-kumar-copy.jpg)