ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు ప్రమాదవశాత్తూ జలపాతంలో మునిగి కన్నుమూశారు. ఆరిజోనా యూనివర్సిటీ నుంచి ఇటీవలే ఎంఎస్ పట్టా పొందిన లక్కిరెడ్డి రాకేష్ రెడ్డి (23), రోహిత్ మణికంఠ రేపాల (25) సహా మొత్తం 16 మంది స్నేహితులు ఆరిజోనాలోని ప్రసిద్ధ ఫాజిల్ క్రీక్ జలపాతం వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తూ రాకేష్, రోహిత్లు జలపాతంలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు హుటాహుటిన చేరుకుని రాత్రి వరకు గాలించినా వారిద్దరి ఆచూకి దొరకలేదు. తర్వాతి రోజు సుమారు 25 అడుగుల లోతులో ఇద్దరి మృతదేహాలను గజ ఈతగాళ్లు గుర్తించారు. ఖమ్మం నగరానికి చెందిన మాంటిస్సోరి, తెలంగాణ నారాయణ పాఠశాలల అధినేతల్లో ఒకరైన చంద్రశేఖర్రెడ్డి, పద్మ దంపతుల ఏకైక కుమారుడు రాకేష్రెడ్డి అని తెలిసింది. రోహిత్ మణికంఠకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఒకటి రెండు రోజుల్లో మతదేహాన్ని స్వస్థలానికి తీసుకురానున్నారు.