తెలంగాణ ఎన్నికల్లో ఓడిపోయిన వ్యక్తులపై వ్యాఖ్యలు చేయొద్దు

Dec 3,2023 16:09 #Nara Chandrababu, #TDP
  • టీడీపీ శ్రేణులకు చంద్రబాబు, లోకేశ్‌ సందేశం

ప్రజాశక్తి-అమరావతి : తెలంగాణ ఎన్నికల ఫలితాలపై దాదాపు స్పష్టత వచ్చింది. మ్యాజిక్‌ ఫిగర్‌ 60 స్థానాలు కాగా, కాంగ్రెస్‌ ఆ మార్కు అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో, తెలంగాణ ఎన్నికల ఫలితాలపై టిడిపి నాయకత్వం స్పందించింది. టీడీపీ అభిమానులు, నేతలు, కార్యకర్తలకు పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ సందేశం వెలువరించారు. ”తెలంగాణ ఎన్నికల ఫలితం ఏదైనా అది తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ప్రజల నిర్ణయం. దానిని అన్ని పార్టీల వలే మనం కూడా శిరోధార్యంగా భావించాలి. ఫలితాలను చూసి మీ మీ వ్యక్తిగత అభిప్రాయాల మేరకు గెలిచిన వ్యక్తులకు లేదా పార్టీలకు హుందాగా అభినందనలు తెలియజేయండి కానీ ఓడిపోయిన వ్యక్తులను, పార్టీలను పలుచన చేసే విధంగా వ్యాఖ్యలు చేయవద్దని విజ్ఞప్తి. ఎన్నికల్లో గెలుపు ఓటములు అనేవి సహజం. 40 సంవత్సరాలకు పైగా ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో పాల్గొని అధికార పక్షం పాత్ర అయినా, ప్రతిపక్షం పాత్ర అయినా పార్టీ పరంగా కానీ, నాయకులు, కార్యకర్తల పరంగా కానీ మనం మన పాత్రను ఎంతో హుందాగా నిర్వహించాం. తెలంగాణ ప్రజల అభిప్రాయాన్ని గౌరవిద్దాం. ఏపీలో మనం ఎదుర్కోబోయే ఎన్నికలపై దీష్టి పెడదాం” అంటూ స్పష్టం చేశారు. ఈ సందేశాన్ని దయచేసి అందరూ పాటించాలని విజ్ఞప్తి చేశారు.

➡️