ఆరోగ్యశ్రీ కోసం ఇంటింటికి మహిళా పోలీసులు

-18న కార్డుల పంపిణీ ప్రారంభించనున్న సిఎం

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో: ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు నూతన కార్డులను మంజూరు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం , దీనికోసం గ్రామ, వార్డు సచివాలయాల్లోని మహిళా పోలీసులను ఇంటింటికి పంపాలని నిర్ణయించింది. ఆరోగ్య సిబ్బందితో కలిసి వారు ఇంటింటికి వెళ్లనున్నారు. వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ బ్రోచర్లను పంపిణీ చేయడం, నూతన లబ్ధిదారులను గుర్తించడం, కొత్త కార్డులను ఇవ్వడంతో పాటు జగనన్న ఆరోగ్య సురక్ష గురించి అవగాహన కల్పించనున్నారు. దిశ యాప్‌ తరహాలో రూపొందించిన ఆరోగ్యశ్రీ యాప్‌ను కూడా ఇంటిలో ఒకరి మొబైల్‌ నెంబర్‌కు డౌన్‌లోడ్‌ చేయాల్సిఉంటుందని ప్రభుత్వం తెలిపింది. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5లక్షల నుంచి రూ.25లక్షలకు పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే కొత్త కార్డులనుకూడా జారీ చేయాలని నిర్ణయించింది. ఇంటింటికి వెడుతున్న మహిళాపోలీసులు వీటిపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. ఇంటి యజయాని ఇకెవైసి తీసుకునే బాధ్యతను వాలంటీర్లకు అప్పగించారు. జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపుల గురించి కూడా వీరు ప్రచారం చేయనున్నారు. నూతన ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 18వ తేది మద్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రారంభించనున్నారు. దీనిని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఆర్‌బికె భవన్‌లలో ప్రత్యేకంగా స్క్రీన్లు ఏర్పాటు చేసి ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు లబ్ధ్‌ిదారులను సమీకరించాలని ప్రభుత్వం పేర్కొంది. అదేవిధంగా వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది తప్పనిసరిగా పాల్గనాలని ఆదేశించింది. స్థానిక శాసనసభ్యులు 19 వ తేది ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఒకటి నుండి జగనన్న ఆరోగ్య సురక్ష జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని 01.01.2024 నుంచి కొనసాగించాలని, వారంలో మండలానికి ఒక వారంలో ఆరోగ్య శిభిరాలు నిర్వహించాలని ప్రభుత్వం పేర్కొంది. గ్రామాలు, వార్డుల్లో ఆరోగ్య శిభిరాలు నిర్వహించడం 6నెలల వ్యవధిలోనే పూర్తి చేయాలన్నారు. ఆరోగ్య శిబిరాలు ఏ గ్రామంలో ఏర్పాటు చేయాలనుకుంటే ఆయా గ్రామ వార్డు సచివాలయానికి మూడు రోజులు ముందు సమాచారాన్ని ప్రభుత్వం పంపనుంది. గ్రామ పంచాయతీ సెక్రటరీలు వీటి నిర్వహణ బాధ్యతలను పర్యవేక్షించనున్నారు.

➡️