ప్రజాశక్తి – హైదరాబాద్ బ్యూరో : ఢిల్లీ మద్యం కేసులో అరెస్టయిన బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని ఈ నెల 23 వరకు కోర్టు పొడిగించింది. 14 రోజుల కస్టడీ ముగియడంతో అధికారులు ఆమెను మంగళవారం న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఢిల్లీ మద్యం విధానం మనీలాండరింగ్ కేసు దర్యాప్తు కొనసాగుతోందని.. కవిత బయట ఉంటే దర్యాప్తును ప్రభావితం చేస్తారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) వాదనలు వినిపించింది. జ్యుడిషియల్ కస్టడీని మరో 14 రోజులు పొడిగించాలని కోరింది. మరోవైపు కస్టడీ పొడిగింపు కోరేందుకు ఇడి వద్ద కొత్తగా ఏమీ లేదని కవిత తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. కోర్టు హాలులో భర్త, మామను కలిసేందుకు జడ్జి అనుమతినివ్వడంతో.. వారు కవితను కలిశారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/04/8-6.jpg)