మేడారం : కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీల్లో మరో రెండింటిని తెలంగాణ సిఎం రేవంత్రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ రెండు పథకాల్ని ఫిబ్రవరి 27వ తేదీ సాయంత్రం ప్రారంభించనున్నట్లు సిఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. ఈ పథకాల ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకాగాంధీ హాజరుకానున్నారని రేవంత్ చెప్పారు. శుక్రవారం మధ్యాహ్నం తెలంగాణా సిఎం రేవంత్రెడ్డి ప్రత్యేక హెలికాప్టర్లో మేడారం వెళ్లి సమ్మక్క-సారలమ్మను దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని వన దేవతలను కోరుకున్నా. ములుగు జిల్లాతో, మంత్రి సీతక్కతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. ముఖ్యమైన కార్యక్రమాలన్నీ మేం ఇక్కడి నుంచే ప్రారంభించాం. ‘హాథ్ సే హాత్ జోడో యాత్ర’ ఇక్కడి నుంచే ప్రారంభించా. మేడారం జాతరలో భక్తులకు ఇబ్బందులు రాకుండా రూ.110 కోట్లు మంజూరు చేశాం” అని ఆయన అన్నారు.
మేడారం జాతరపై కేంద్రం వివక్ష
”మేడారం జాతరపై వివక్ష చూపడం సరికాదు. జాతీయ పండుగగా ప్రకటించడం సాధ్యం కాదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పినట్లుగా పత్రికల్లో చూశాను. కేంద్రం కుంభమేళాను జాతీయ పండుగగా నిర్వహిస్తోంది. రూ.వందల కోట్లను విడుదల చేసింది. దక్షిణాది కుంభమేళా మేడారం జాతరకు మాత్రం కేవలం రూ.3 కోట్లు కేటాయించింది. తెలంగాణను కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందనేందుకు ఈ జాతర పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరే నిదర్శనం. మేడారం జాతరకు ప్రధాని మోడీ, అమిత్ షాను ఆహ్వానిస్తున్నాం. జాతరకు వచ్చి మోడీ, అమిత్ షా సమ్మక్క, సారలమ్మలను దర్శించుకోవాలి. అయోధ్యలో రాముడిని దర్శించుకోవాలని మోడీ, అమిత్ షా చెప్పారు. ఆ మాదిరిగానే మేడారం జాతరను వారిద్దరూ వచ్చి దర్శించుకోవాలి. వారిని అధికారిక హౌదాలో స్వాగతం పలికే బాధ్యతను నేను, మంత్రివర్గం చూసుకుంటాం. మేడారానికి జాతీయ హౌదా ఇవ్వలేమంటూ కిషన్ రెడ్డి ఆదివాసీలను అవమానించవద్దు. సీఎం కేసీఆర్ మేడారం సందర్శించుకోకపోవడం వల్ల భారీ మూల్యం చెల్లించుకున్నారు. భవిష్యత్తులో మీకూ అదే పరిస్థితి వస్తుందని కిషన్ రెడ్డికి చెబుతున్నా. కేంద్రం ఉత్తర భారతం, దక్షిణ భారతం అంటూ వివక్ష చూపడం మంచిది కాదు. దక్షిణ భారత్లోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా మేడారం జాతరకు గుర్తింపు ఉంది” అని రేవంత్ అన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారమే మా విధానం
సమ్మక్క, సారలమ్మ నుంచి స్ఫూర్తి పొందాం. తండాలు, గూడేల్లోనూ ప్రజా పాలనకు శ్రీకారం చుట్టాం. బడుగులు, ఆదివాసీల పక్షాన నిలబడి పోరాడి సమ్మక్క- సారలమ్మ నేలకొరిగారు గనుకే వందల ఏళ్లయినా వారిని దేవుళ్లుగా కొలుస్తున్నాం. ప్రజల కోసం నిలబడి పాలకులతో కొట్లాడినందుకు అమరులై దేవతలుగా విలసిల్లుతున్నారు. నాటి నుంచి నేటి వరకు పాలకులు ప్రజల్ని వేధించినప్పుడు, పీడించినప్పుడు, ఆధిపత్యం చెలాయించాలనుకున్నప్పుడు ఎవరో ఒకరు నిలబడతారు.. నిలబడినవాడు నిటారుగా నిలబడి కొట్లాడి పేద ప్రజల పక్షాన విజయం సాధిస్తారనే స్ఫూర్తిని ఈ దేవతల నుంచే పొందాం. గత పదేళ్లుగా పాలకుల నిరంకుశ ధోరణులపై కొట్లాడాం. తద్వారా ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ప్రజా సమస్యల్ని పరిష్కరించేందుకు మా శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం. మా అజెండా ప్రజల అజెండా. ప్రజలు మా దష్టికి తీసుకొచ్చిన సమస్యల్నే విధానాలుగా రూపొందించి పరిష్కారం కోసం పనిచేస్తాం”. అని రేవంత్ అన్నారు.
మార్చి 2వ తేదీన మరో 6 వేల ఉద్యోగాల్ని భర్తీ చేస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిని దోపిడీని కళ్లకు కట్టినట్టు చూపాం. విద్యుత్ విషయంలో గత ప్రభుత్వ తప్పులను ప్రజల ముందుంచాం. కెసిఆర్ అవినీతిపై సిబిఐకి ఇవ్వాలని భాజపా కోరుతోంది. పదేళ్లుగా కేంద్రంలో ఉన్నది భాజపా ప్రభుత్వమే. సిబిఐ, ఈడీ, ఐటీ.. భాజపా చేతులో ఉన్నా కెసిఆర్పై ఒక్క కేసూ పెట్టలేదు. కెసిఆర్ ప్రభుత్వ అవినీతిపై విచారణ చేపట్టలేదు. గతంలో కేంద్రానికి ఫిర్యాదు చేసినా విచారణ చేయలేదు. న్యాయ విచారణ నిర్ణయం తీసుకున్న తర్వాత భాజపా సిబిఐ విచారణ కోరుతోంది అని రేవంత్ అన్నారు.