డాటర్‌ ఆఫ్‌ కు బదులు వైఫ్‌ ఆఫ్‌.. నలుగురిని బయటకు పంపిన నిర్వాహకులు

Jun 9,2024 14:47 #daughter off, #Instead, #wife off

హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష ప్రశాంతంగా ప్రారంభమైంది. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరగనుంది. పరీక్షా కేంద్రాల్లోకి ఉదయం 10 గంటల వరకు అనుమతిస్తామని టీజీపీఎస్సీ ప్రకటించడంతో అభ్యర్థులు ముందుగానే కేంద్రాలకు చేరుకున్నారు. కేంద్రాల వద్ద భారీ ఏర్పాట్లు చేశారు. ప్రతి అభ్యర్థిని తనిఖీ చేసిన తర్వాత సిబ్బంది వారిని పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు. అయితే.. ఆదిలాబాద్‌ జిల్లా మావలలోని చావర ఆకాడమి సెంటర్‌ లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది.గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థినులకు చేదు అనుభవం ఎదురైంది. ఆధార్‌ కార్డు లో డాటర్‌ ఆఫ్‌ కు బదులుగా వైఫ్‌ ఆఫ్‌ ఉన్నందుకు నిర్వాహకులు నలుగురు అభ్యర్ధులను బయటకు పంపారు. గ్రూప్‌ 1 కు దరఖాస్తు వివాహం జరగక ముందు చేసుకున్నామని ఇప్పుడు వివాహం జరిగింది కాబట్టే వైఫ్‌ ఆఫ్‌ ఉందని నిర్వాహకులకు ఎంత చెప్పినా లోనికి అనుమతించేందుకు ససేమిరా అన్నారు.
అయితే నిర్వాహకులు అడ్రస్‌ ఫ్రూఫ్‌ చూపించాలని తెలిపారు. వారివద్ద లేదని చెప్పడంతో అడ్రస్‌ ఫ్రూఫ్‌ చూపిస్తే అప్పుడు లోనికి అనుమతించడమా? వద్దా? అనేది క్లారిటీ ఇస్తామన్నారు. దీంతో అడ్రస్‌ ఫ్రూఫ్‌ కోసం ఇంటికి పరుగులు పెట్టారు. అయితే వారు తిరిగి వచ్చేసరికి నిమిషం ఆలస్యం అయ్యిందని అధికారులు ఎగ్జామ్‌ హాల్లోకి అనుమతించలేదు. గ్రూప్‌ 1 పరిక్షకు ఓ మహిళ అభ్యర్థి దూరం కావడంతో కన్నీరుమున్నీరుగా విలపించింది. పెళ్లైన తరువాత వైఫ్‌ ఆఫ్‌ కాకుండా డాటర్‌ ఆఫ్‌ ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు. అధికారుల తీరుపై మండిపడ్డారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా కొన్ని కేంద్రాలకు ఆలస్యంగా రావడంతో కొందరు అభ్యర్థులు నిరాశతో వెనుదిరిగారు. నిమిషం ఆలస్యంగా వచ్చిన పది మంది అభ్యర్థులను సిద్దిపేట డిగ్రీ కళాశాల కేంద్రానికి అధికారులు అనుమతించలేదు. దీంతో వారు అక్కడి నుంచి వెనుదిరిగారు. కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని మహిళా కళాశాల సెంటర్‌ కు ఆలస్యంగా వచ్చిన ఓ యువకుడికి అధికారులు అనుమతి ఇవ్వలేదు. గోదావరిఖనిలోని బాలికల జూనియర్‌ కళాశాల పరీక్షా కేంద్రానికి వచ్చిన తీగల కావేరి అనే యువతిని 8 నిమిషాలు ఆలస్యంగా రావడంతో సిబ్బంది వెనక్కి పంపారు.
ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చేవారిని అనుమతించమని అధికారులు వెల్లడించిన విషయం తెలిసిందే. పరీక్షా కేంద్రాల పరిసరాల్లో రెవెన్యూ శాఖ 144 సెక్షన్‌ ఉత్తర్వులు జారీ చేసింది. పరీక్షా కేంద్రం యొక్క గేట్లు మూసివేసిన తరువాత అభ్యర్థులను పరీక్షా హాలులోకి అనుమతించరు. అభ్యర్థులు ఎ4 పరిమాణ కాగితంపై ముద్రించిన హాల్‌ టికెట్‌ను లేజర్‌ ప్రింటర్‌తో తీసుకురావాలని సూచించారు. ప్రాధాన్యంగా కలర్‌ ప్రింట్‌ పరీక్షకు హాజరు అయ్యే ముందు ప్రింటెడ్‌ హాల్‌ టికెట్‌ పై మూడు నెలలు ముందు తీసుకున్న పాస్‌పోర్ట్‌ సైజు ఫోటోను అతికించడం తప్పనిసరి అని ముందునుంచి అధికారులు వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఆదిలాబాద్‌ జిల్లాలోని 18 కేంద్రాల్లో 6829 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు.

➡️