సైఫ్‌ ర్యాగింగ్‌ చేయడం నిజమే.. తేల్చిచెప్పిన కమిటీ

Jan 9,2024 12:09 #Ragging, #warangal
  • ర్యాగింగ్‌ ఆరోపణలతో ఆత్మహత్య చేసుకున్న ప్రీతి
  • సస్పెన్షన్‌ 97 రోజులు పొడిగింపు

వరంగల్‌ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైన వరంగల్‌ కాకతీయ మెడికల్‌ కళాశాల (కేఎంసీ) పీజీ విద్యార్థిని ధరావత్‌ ప్రీతి ఆత్మహత్య కేసు నిందితుడు సైఫ్‌పై వచ్చిన ఆరోపణలు నిజమేనని ర్యాగింగ్‌ నిరోధక కమిటీ తేల్చి చెప్పింది. సైఫ్‌పై విధించిన సస్పెన్షన్‌ కాలం మార్చి 3తో ముగియనున్న నేపథ్యంలో నిషేధాన్ని మరో 97 రోజులు పొడిగించింది. గతేడాది ఫిబ్రవరి 26న ప్రీతి మృతి తర్వాత సైఫ్‌ అరెస్టయ్యాడు. ఈ క్రమంలో అతడిపై ఏడాదిపాటు నిషేధం విధిస్తూ ర్యాగింగ్‌ కమిటీ నిర్ణయం తీసుకుంది. దీనిపై సైఫ్‌ హైకోర్టును ఆశ్రయించడంతో సస్పెన్షన్‌ను తాత్కాలికంగా ఎత్తివేశారు. గతేడాది నవంబరు 9న హైకోర్టు ఆదేశాల మేరకు సమావేశమైన ర్యాగింగ్‌ కమిటీ ఎదుట సైఫ్‌ హాజరై వివరణ ఇచ్చాడు. ఈ క్రమంలో సైఫ్‌పై వచ్చిన ఆరోపణలు వాస్తవమేనని కమిటీ న్యాయస్థానానికి తెలిపింది. దీంతో కమిటీ విధించిన సస్పెన్షన్‌ను కొనసాగించవచ్చని న్యాయస్థానం పేర్కొనడంతో, సైఫ్‌పై నిషేధాన్ని మరో 97 రోజులు పొడిగిస్తూ కమిటీ నిర్ణయం తీసుకుంది. దాంతో పాటుగా కోర్టు ఉత్తర్వుల అనంతరం విచారణకు హాజరుకాకుండా విధులకు హాజరైన 97 రోజుల కాలాన్ని సైతం కలుపుకొని 2024 జూన్‌ 8వ తేదీ వరకు సస్పెన్షన్‌ కాలాన్ని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు కేఎంసీ ప్రిన్సిపా ల్‌ మోహన్దాస్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

➡️