Jawan కుటుంబాలకు రూ.కోటి చొప్పున సాయం చేయండి : జగన్‌

Jul 1,2024 20:05 #CRPF jawans, #death, #jagan, #ladakh

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : లడాఖ్‌లో యుద్ధ ట్యాంకు కొట్టుకుపోయిన ప్రమాదంలో జవాన్లు ప్రాణాలు కోల్పోవడం పట్ల మాజీ ముఖ్యమంత్రి, వైసిపి అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన ముగ్గురు జవాన్లు మరణించడం విచారకరమని పేర్కొన్నారు. వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.కోటి చొప్పున ఆర్థిక సాయం అందించాలని కోరారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రమాదంలో కృష్ణా జిల్లా పెడన మండలం చేవెండ్ర గ్రామానికి చెందిన సాదరబోయిన నాగరాజు, ప్రకాశం జిల్లా రాచర్ల మండలం కాల్వపల్లె గ్రామానికి చెందిన జూనియర్‌ కమిషన్డ్‌ అధికారి ముత్తుముల రామకృష్ణారెడ్డి, బాపట్ల జిల్లా రేపల్లె మండలం ఇస్లాంపూర్‌కు చెందిన సుభాన్‌ఖాన్‌ల కుటుంబాలకు సంతాపాన్ని తెలిపారు. వీరి అంత్యక్రియల్లో పాల్గొని వారి కుటుంబాలకు బాసటగా నిలవాలని వైసిపి నియోజకవర్గ నేతలను కోరారు.
మాజీ మంత్రి ‘చెల్లుబోయిన’ తల్లి మృతి పట్ల సంతాపం
మాజీ మంత్రి, వైసిపి సీనియర్‌ నాయకులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తల్లి చెల్లుబోయిన సుభద్రమ్మ మరణం పట్ల వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు.

➡️