స్థానిక టిడిపి నాయకులు
ప్రజాశక్తి-రాజానగరం : రాజానగరం నియోజకవర్గంలో జనసేన పార్టీ పోటీ చేస్తుందన్న నిర్ణయాన్ని స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యతిరేకిస్తున్నామన్నారు. జనసేన అధినేత తొందరపాటు నిర్ణయం వలన టిడిపికి నష్టం వస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చంనాయుడుకు తేల్చి చెప్పారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యాలయం మంగళగిరిలో రాష్ట్ర అధ్యక్షుడుతో నియోజకవర్గం టిడిపి నాయకులు కోరుకొండ మాజీ జెడ్పీటీసీ వెంకటరత్నం అప్పలనరసారావు, మాజీ ఎంపిపి నూకరత్నం, మండలం అధ్యక్షుడు గండి విజయకుమార్, ఎం. అప్పారావు తదితరులు శనివారం సమావేశమై వినతిపత్రం అందజేశారు. ఇన్ ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి నాయకత్వంలో నియోజకవర్గంలో టీడీపీ బలంగా ఉందని ఈ పరిస్థితుల్లో జనసేనకు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. నియోజకవర్గంలో జనసేనకు గెలిచే సత్తా లేదని ఇటువంటి తొందరపాటు నిర్ణయం వలన టిడిపి నాయకత్వం దెబ్బతింటుందని చెప్పారు. పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమా జనసేన పార్టీ మద్దతుగా మాట్లాడడం ఖండిస్తున్నామన్నారు. జనసేన గెలుపుకు సహకరించేది లేదు అని తెగేసి చెప్పారు. 29వ తేదీన నియోజకవర్గంలో జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సభకు రావడం లేదన్నారు. దీనిపై పార్టీ అధ్యక్షుడు అచ్చంనాయుడు మాట్లాడుతూ రాజానగరం నియోజకవర్గంలో టిడిపి నాయకత్వం అధైర్య పడవద్దు అన్నారు. రెండు పార్టీల అధినేతలు కలిసి నియోజకవర్గంలో అభ్యర్థుల వివరాలు ప్రకటన ఉంటుందని చెప్పారు. పార్టీ కార్యక్రమాలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అయితే పార్టీ నిర్ణయం ప్రకటించలేదని చంద్రబాబు సభను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ కోరారు.